వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేయాలని ఏపీ సీఎం చంద్రబాబు దృఢనిశ్చయంతో ఉన్నారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు విడిగా వద్దని పార్టీ అధిష్ఠానానికి చెబుతున్నా.. కలిసి ప్రయాణించకపోతే రెండు పార్టీలకు నష్టమని ఎప్పటికప్పుడు ఆ ప్రయత్నాలకు బాబు అడ్డుకట్ట వేస్తూ వస్తున్నారు. ఇక ఈ టెన్షన్ తీరిపోయిందన్న చంద్రబాబును.. విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెగ టెన్షన్ పెడుతున్నారట. బీజేపీతో కలిసి పోటీచేస్తే టీడీపీకి లాభం కంటే నష్టమే ఎక్కువని చెప్పడంతో.. చంద్రబాబుకు గొంతులో వెలక్కాయపడినట్టు అయిపోయిందట. అంతేగాక తాను నిర్వహించిన సర్వేలో ఇవన్నీ తేలాయని చెప్పడంతో బాబులో కంగారుమొదలైంది.
లగడపాటి రాజగోపాల్.. ఈ పేరు వింటే ఆయన నిర్వహించిన సర్వేలు.. అందులోని ఫలితాలే అందరికీ గుర్తుంటాయి. ఎన్నికల ముందు ఆయన నిర్వహించే సర్వేలకు ఎంతో ప్రాధాన్యం ఉందన్న విషయం తెలిసిందే! ఇప్పుడు ఆయన సర్వే చంద్రబాబును కలవరపెడుతోంది. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబుతో రాజగోపాల్ భేటీ అవ్వడం చర్చనీయంశమైంది. ఇక విజయవాడ ఎంపీగా టీడీపీ తరఫున పోటీచేస్తారనే ప్రచారం జోరుగా జరిగింది. కానీ అసలు విషయం వేరే ఉందట. అదేంటంటే.. ఎన్నికలు జరిగితే.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న లెక్కలపై.. లగడపాటి రీసెంట్ గా ఓ సర్వే చేయించారట.
చంద్రబాబుకు ఈ రిపోర్ట్ ఇవ్వడానికే లగడపాటి ప్రత్యేకంగా వెళ్లి మరీ కలిశారని తెలుస్తోంది. ఈ రిపోర్టులు చూసిన బాబుకు దిమ్మతిరిగిందట. అందులో ఏముందంటే.. బీజేపీతో కలిసి పోటీ చేస్తే వచ్చే సీట్లకన్నా.. సొంతంగా పోటీ చేస్తేనే కనీసం 20 సీట్లు టీడీపీకి ఎక్కువగా వస్తాయని తేలిందట. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే.. ఒంటరిగా పోటీ చేస్తే టీడీపీకి 160 సీట్లు.. బీజేపీతో కలిసి పోటీ చేస్తే.. 140 నుంచి 150 సీట్లు సొంతం చేసుకోవచ్చని లగడపాటి చెప్పారట. అలాగే.. టీడీపీ సొంతంగా పోటీ చేస్తే.. కనీసం 23 ఎంపీ సీట్లు కూడా గెలుచుకునే అవకాశం ఉందట.
ఈ రిపోర్ట్ పూర్తిగా స్టడీ చేసిన చంద్రబాబుకు.. ఇప్పుడు బీజేపీతో రాష్ట్రానికి కలిగే లాభం కంటే.. పార్టీకి వచ్చే ఎన్నికల్లో కలిగే నష్టమే ఎక్కువ బాధను కలిగించిందట. అసలే లగడపాటి చేయించే రివ్యూలు.. చాలా పక్కగా.. రిజల్ట్ ఓరియెంటెడ్ గా ఉంటాయని పేరుంది. అందుకే.. ఈ విషయాన్ని కాస్త ప్రెస్టేజియస్ గా తీసుకుంటున్నారట చంద్రబాబు. మరి వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేస్తారో లేక.. లగడపాటిని నమ్ముకుని ఒంటరిగా పోటీచేస్తారో!!