ప్రధానమంత్రి నరేంద్రమోడీ పీఎం అయినప్పటి నుంచి ప్రాంతీయ పార్టీల విషయంలో నిర్దాక్షిణ్యంగా అణిచివేత ధోరణితో వెళుతున్నారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా బీజేపీని మరింత బలోపేతం చేసే ఉద్దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీల అణిచివేత విషయంలో మాత్రం రాజీపడడం లేదు. ఈ క్రమంలోనే మోడీకి అటు ఢిల్లీ, ఇటు బీహార్, తమిళనాడు, బెంగాల్ ఎన్నికల్లో చావుదెబ్బ తగిలింది.
మోడీ ప్రాంతీయ పార్టీలను అణిచివేసి బీజేపీని ఎంత బలోపేతం చేయాలని ప్లాన్లు వేస్తున్నా…చాలా రాష్ట్రాల్లో ప్రజలు ప్రాంతీయ పార్టీలకే పట్టంగడుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ప్రధాని మోడీ ఢిల్లీ పీఠం అధిష్టించేందుకు కీ రోల్ పోషించిన యూపీలో వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల్లో యూపీలో ఉన్న 80 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 72 గెలుచుకుంది.
మోడీ పీఎం అవ్వడంలో యూఈ చాలా కీ రోల్ పోషించింది. ఇక ఇక్కడ వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం విజయం సాధించాలని మోడీ ప్లాన్లు వేస్తుండగా…ఇప్పుడు మోడీకి ముసళ్ల పండగలాంటి స్కెచ్ రెడీ అయ్యింది. యూపీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ జట్టుగా బరిలో దిగాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. పెద్ద నోట్ల రద్దు ప్రభావం ప్రజలపై దారుణంగా పడిందని, దీంతో ఉమ్మడిగా రంగంలోకి దిగితే విజయం తథ్యమని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
యూపీలో 27 ఏళ్ళ నుంచి అధికారానికి దూరంగా కాంగ్రెస్ ఉంది. దేశ రాజకీయాల్లో ఉత్తర ప్రదేశ్కు ఉన్న ప్రాధాన్యం వేరే చెప్పనక్కర్లేదు. రాహుల్ గాంధీ సైతం ఇక్కడ కిసాన్యాత్రతో ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ ఎస్పీతో పొత్తు పెట్టుకునేందుకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సైతం ఆసక్తితో ఉన్నారు. ఇక యూపీ సీఎం అఖిలేష్ సైతం కాంగ్రెస్తో పొత్తుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.
ఇక రాజకీయవర్గాల అంచనా ప్రకారం యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ – ఎస్పీ కలిస్తే ఈ కూటమి అధికారంలోకి వస్తుందని, 2019 ఎన్నికల్లో యూపీలో బీజేపీ హవాకు బ్రేకులు వేస్తుందని తెలుస్తోంది. ఈ రెండు పార్టీలు కలిస్తే మోడీకి యూపీ ఎన్నికల్లో చుక్కలు కనపడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి.