సాధారణంగా పొలిటీషియన్లకి మీడియా గొట్టం ముందుంటేనే కానీ గొంతు పెగలదనే విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో ఇది మరింతగా పెరిగిపోయింది. మీడియా ఛానెళ్లు పెరిగిపోవడం, క్షణాల్లోనే ఆయా నేతల వ్యాఖ్యలపై సోషల్ మీడియాల్లో రెస్పాన్స్ రావడం, ఎక్కవు మంది దృష్టి వారిపై మళ్లడం వంటి ప్రధాన కారణాల నేపథ్యంలో ఇప్పుడు ప్రతి గల్లీ నేత సైతం మీడియా ముందు తప్ప ఇంకెక్కడా మాట్లాడేందుకు అంతగా ఇష్టపడడం లేదు. మన నేతలకు మైకులుంటేనేగానీ.. మాట్లాడలేని పరిస్థితి వచ్చింది… అందుకే అసెంబ్లీలోనూ మైకులు ఏర్పాటు చేశాం- అని తరచు అప్పటి సీఎం ఎన్టీఆర్ సరదా వ్యాఖ్యలు చేసేవారు.
ఇక, తాజా విషయానికి వస్తే.. తెలంగాణ సీఎం కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత కు ఇటీవల కాలంలో మీడియా పిచ్చి పీక్కి వెళ్లిందన్న టాక్ వస్తోంది. వాస్తవానికి తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో జాగృతి సంస్థను స్థాపించి పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్నారు. ఇక అప్పటి నుంచి ఏ అకేషన్ అయినా కవితకి మీడియాతో ఎనలేని సంబంధం పెరిగిపోయింది. నిజానికి చెప్పాలంటే కవిత ఏం మాట్లాడిన రెండు సటైర్లు, మూడు జోకులతో ఆద్యంతం ఆకట్టుకుంటోంది. సబ్జెక్ట్ లేకుండా ఆమె ఎప్పుడూ మీటింగ్లు పెట్టిన సందర్భాలు లేవు. అయితే, రానురాను ఆమెకు మీడియా పిచ్చి బాగా ఎక్కువైందట.
ఇటీవల కవిత ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో పర్యటించారు. ఈ సందర్భంగా బొగ్గుగని కార్మికులతో మాట్లాడేందుకు నేరుగా గనిలోకి వెళ్లారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆమె తన పర్యటన కవరేజీ కోసం ఏకంగా హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా మీడియా మిత్రులను వెంటేసుకుని వెళ్లారు. దీనికి గాను సుమారు వేలల్లో ఖర్చయిందట. వారికి వాహనాల ఏర్పాటు, భోజనసదుపాయాలు, తిరు గు ప్రయాణం వంటి అనేక ఖర్చు స్థానిక టీఆర్ ఎస్ నేతలపై పడిందని ప్రచారం జరుగుతోంది.
వాస్తవానికి అన్ని మీడియా హౌస్లకు అన్ని జిల్లాల్లోనూ యంత్రాంగం ఉంది. కాబట్టి ఖమ్మం పర్యటనలో కవిత కార్యకలపాలను కవర్ చేసేందుకు స్థానిక మీడియా ఉంటుంది. అయితే, ఆమె ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి వెంటబెట్టుకు వెళ్లారనేది ప్రశ్నార్థకం. మొత్తానికి రాజధాని మీడియా అయితే, కవరేజ్ బాగుంటుందని, తనకు ఇంకా పేరు వస్తుందని కవిత భావించారని టాక్. మొత్తానికి అయితే, దీనిపై ఆమె ఎలాంటి కామెంట్లు చేయడంలేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం కవితక్కపై కామెంట్ల వర్షం కురుస్తోంది. ఈ మీడియా పిచ్చేందక్కా.. అంటూ తెలంగాణ సోదరులు, సోదరీమణులు కుమ్మేస్తన్నరు.