రాష్ట్ర విభజన తర్వాత ఏపీని దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలని సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాజధాని అమరావతిని ఇంటర్నేషనల్ స్థాయిలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సింగపూర్ నుంచి పెద్ద ఎత్తున ప్రతినిధులను తీసుకువచ్చి ఇక్కడ నిర్మాణాలు చేస్తున్నారు. ఇదిలావుంటే, ఇప్పుడు సమాజంలో క్రికెట్కు ఉన్న పిచ్చి అంతా ఇంతకాదు. చిన్నా పెద్ద అందరూ క్రికెట్ లవర్సే!! ఈ క్రమంలో చంద్రబాబు క్రికెట్ను డెవలప్ చేయడం ద్వారా ఏపీని ఇంటర్నేషనల్ లెవిల్లో అభివృద్ధి చేయాలని ప్లాన్ సిద్ధం చేస్తున్నారు.
ముఖ్యంగా రాజధాని ప్రాంతంగా ఉన్న విజయవాడను ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లకు సిద్ధం చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడకు కేవలం 25 కిలో మీటర్ల దూరంలోని మూలపాడును అంతర్జాతీయ క్రికెట్ టోర్నీలకు రెడీ చేస్తున్నారు. ఇటీవల మూలపాడులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబుకు ఇక్కడి వాతావరణం భారీ స్థాయిలో ఆకట్టుకుందట. చుట్టూ కొండలు, పచ్చని వాతావరణం, ప్రశాంతమైన వాతావరణం ఆయనను పెద్దగా ఆకట్టుకున్నాయట. ఇలాంటి ప్రాంతంలో హరిత పర్యాటకాన్ని డెవలప్ చేయడం ద్వారా.. అంతర్జాతీయంగా పర్యాటకులను ఆకట్టుకోవాలని బాబు ప్లాన్ రెడీ చేశారు.
ప్రస్తుతం ఏసీఏ బాధ్యతలు చేస్తున్న బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజుకి ఈ పర్యాటక హబ్ని డెవలప్చేసే బాధ్యత అప్పగించారు. ఆ ప్రాంతంలో కొండలు, వాగులు ఉండడంతో ట్రెక్కింగ్, ప్యారాచూట్ వంటి సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటంతో పర్యాటకులు నాలుగైదు రోజులు ఉండేందుకు అనువైన భవనాలు కూడా నిర్మించాలని ఆదేశించారు.
అమరావతి నిర్మాణం పూర్తయితే రాజధాని నుంచి మూలపాడుకు కేవలం 15 నిముషాల్లో చేరుకోవచ్చు. సీఎం అనుకున్నది అనుకున్నట్లు జరిగితే.. మూలపాడు రాష్ట్రంలో అతి పెద్ద హరిత పర్యాటక కేంద్రంగా మారే అవకాశముంది. అంతేకాకుండా.. ఏడాదికి నాలుగైదు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచలు నిర్వహిస్తే మూలపాడుకు క్యూ కట్టే పర్యాటకుల సంఖ్య ఎక్కువే. క్రికెట్ స్టేడియంతో పాటు కొండలు, వాగులు, ఆహ్లాదకరమైన వాతావరణం కూడా కలిసోచ్చే అంశం.