రియల్ ఎస్టేట్ మాయ అంతా ఇంతా కాదు. ఒక్కసారి హిట్టయ్యామా.. వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేదు. అంతేకాదు, ఎక్కడైనా రియల్ ఎస్టేట్ వెంచర్ పడిందంటే అక్కడ డెవలప్మెంట్ జరుగుతున్నట్టుగా పబ్లిక్ టాక్! ఇప్పుడు ఈ విషయంపై దృష్టి పెట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఆశ్చర్యంగా అనిపించినా ఇది వాస్తవం. అధికారులతో ఇప్పుడు ఎక్కడ మీటింగ్ పెట్టినా.. రియల్ ఎస్టేట్ గురంచే కేసీఆర్ ఆరా తీస్తున్నారని తెలుస్తోంది. దీనికి ఒక కారణం ఉంది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం మొత్తం రాష్ట్రంలోని 10 జిల్లాలను ఏకంగా 27 జిల్లాలుగా మార్చేస్తున్నారు. అయితే, వీటికి బూం రావాలంటే.. రియల్ పరంగా బూం రావాలని కేసీఆర్ భావించారు.
ఇదే జరిగితే.. తన జిల్లాల కాన్సెప్ట్ హిట్టవడంతోపాటు.. రిజిస్ట్రేషన్లు.. భూ లావాదేవీల పేరిట… ప్రభుత్వానికి భారీ ఎత్తున ఇన్కమ్ వస్తుందని కేసీఆర్ భావిస్తున్నట్టున్నారు. గతంలోనూ ఆయన హైదరాబాద్ ,రంగారెడ్డి జిల్లాలలో గత రెండేళ్లలో పలు ప్రాజెక్టులు ప్రకటించినా ఆశించినంత రియల్ ఎస్టేట్ పెరగలేదు. దీనిపై కేసీఆర్ తీవ్ర ఆవేదనగా ఉన్నారు. అయితే, తాజాగా జిల్లాల ప్రకటన నేపథ్యంలో రియల్ ఎస్టేట్ డెవలప్ అయితే బాగుండునని ఆశించారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలపై ఆయన రోజూ కలెక్టర్లు, రెవెన్యూ శాఖ అధికారులతో భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగా వారిని మీమీ జిల్లాల పరిధిలో(కొత్తగా ఏర్పడే జిల్లాలు) రియల్ బూం ఎలా ఉంది? అని ఆసక్తిగా ప్రశ్నిస్తున్నారట.
అంతేకాదు, రియల్ బూం పెరిగేందుకు ఏం చేస్తే బాగుంటుందని కూడా వారిని సలహాలు కోరుతున్నారని తెలిసింది. ఈ సందర్భంగా అధికారులు అందరూ సీఎం కేసీఆర్ను నొప్పించకుండా .. అంతా బాగానే ఉందని సమాధానం చెబుతున్నారట. ముఖ్యంగా జిల్లాలు ప్రకటించాక.. గతం కన్నా.. ఇప్పటి పరిస్థితి బాగుందని, దాదాపు 30% రియల్ బూం పెరిగిందని చెబుతున్నారట. దీంతో కేసీఆర్ హ్యాపీగా ఫీలై.. మరింతగా పెంచాలని ఆదేశిస్తున్నారట. ఏదేమైనా సీఎం అంతటివాడు రియల్ మాయలో పడడం అంటే ఇదేనేమో!