ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు హోరాహోరీగా ప్రచారాలు జరిగిన సంగతి తెలిసిందే. ఓ వైపు అల్లు అర్జున్ అదేవిధంగా మరో వైపు రామ్ చరణ్ ఎన్నికల ప్రచారాలలో పాల్గొన్ని సందడి చేశారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న క్రమంలో.. రాంచరణ్ తల్లి సురేఖతో కలిసి హాజరై సందడి చేశాడు. అదే టైంలో అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవికి మద్దతుగా నంద్యాలలో పర్యటించాడు.
ఈ క్రమంలో అనుమతి లేకుండా జన సమీకరణ చేశారని అల్లు అర్జున్ పై.. అలాగే వైసిపి ఎమ్మెల్యే శిల్పా రవి పై ఆర్వో ఫిర్యాదు మేరకు నంద్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు ఏం జరిగిందంటే ఎన్నికల ప్రచారంలో చివరి రోజు శిల్పా రవికి మద్దతుగా నంద్యాల పర్యటించడానికి అల్లు అర్జున్ రాగ.. భారీ సంఖ్యలో అభిమానులు తరలిరావడం.. సెన్సేషనల్ గా మారింది. ఇక 2024 ఏపీ ఎన్నికల్లో సినిమా సెలబ్రిటీస్ సందడి, ప్రచారాలు చేయడం ఎక్కువగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రధానంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఎంతోమంది స్టార్ సెలబ్రిటీస్ ప్రచారం చేశారు.
జబర్దస్త్ టీం, సీరియల్ నటులు, మెగా హీరోలు ఎన్నికల ప్రచారంలో పాల్గొని వారికి మద్దతు పలికారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీ ఎన్నికల్లో సందడి జరిగింది. ఈ క్రమంలో జనసేనకి మద్దతుగా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసి.. నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి స్నేహితుడు కావడంతో ఆయన కోసం ప్రచారం నిర్వహించడం అందరికీ షాక్ ఇచ్చింది. అయితే అనుమతి లేకుండా జన సమీకరణ చేశారని ఆరో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.