ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే…ఒకప్పుడు టిడిపి కంచుకోట. కానీ 2019 ఎన్నికల నుంచి సీన్ మారిపోయింది. టిడిపి కంచుకోటలని వైసీపీ బ్రేక్ చేసి..అనంతలో అద్భుతమైన విజయాలు అందుకుంది. జిల్లాలో 14 సీట్లు ఉంటే వైసీపీ 12 సీట్లు గెలుచుకుంది. టిడిపి కేవలం 2 సీట్లకే పరిమితమైంది. అయితే ఎలాగోలా అనంతపై పట్టు సాధించాలని టిడిపి ప్రయత్నిస్తూనే ఉంది. టిడిపి నేతలు కష్టపడుతున్నారు.
కానీ అనుకున్న మేర టిడిపికి బలం పెరగలేదు. తాజాగా కూడా బాబు అనంత టూర్కు వచ్చారు. రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్ నియోజకవర్గాల్లో బాబు పర్యటించారు. మూడు చోట్ల టిడిపి శ్రేణులు బాగానే వచ్చారు. కానీ మూడు నియోజకవర్గాల్లో టిడిపికి అనుకున్న మేర బలం పెరగలేదు. మొదట రాయదుర్గంలో టిడిపి సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులు ఉన్నారు. అయితే అక్కడ వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి బలంగా ఉన్నారు. ఇప్పటికీ వైసీపీకి ఆధిక్యం కనిపిస్తోంది. ఇటు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైసీపీకి పెద్ద పాజిటివ్ లేదు. మంత్రి ఉషశ్రీ చరణ్కు కాస్త నెగిటివ్ ఉంది.
కాకపోతే అక్కడ టిడిపి లో వర్గ పోరు ఉంది. మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరీ, టిడిపి ఇంచార్జ్ ఉమా మహేశ్వరనాయుడుకు పొసగడం లేదు. ఇద్దరి మధ్య విభేదాలు తారస్థాయిలో కొనసాగుతున్నాయి. దీని వల్ల టిడిపికి మైనస్ అవుతుంది. నెక్స్ట్ ఒకరికి సీటు ఇస్తే ఒకరు సహకరించే పరిస్తితి లేదు.
అటు గుంతకల్ విషయానికొస్తే..ఇక్కడ టిడిపి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. టిడిపి ఇంచార్జ్ జితేందర్ గౌడ్ పై వ్యతిరేకత ఇంకా ఉంది. దీంతో గుంతకల్ లో వైసీపీదే లీడ్. మొత్తానికి చూస్తే బాబు జిల్లాలో పర్యటించిన టిడిపికి కలిసిరాలేదు.