మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కెసిఆర్ పక్కన పెట్టేశారు. ఆయనకు టిక్కెట్ ఇచ్చినా ఉపయోగం లేదని ఆయనకు గెలిచే స్కోపులేదని తుమ్మలను పక్కన పెట్టిన మాట వాస్తవం. నిజంగానే తుమ్మల బలవంతుడు అయితే రాష్ట్రవ్యాప్తంగా సునామీ బీచి బీఆర్ఎస్ అసాధారణ మెజార్టీతో గెలిచినప్పుడు ఆయన పాలేరులో ఓడిపోడు. పైగా మంత్రి హోదాలో ఆయన ఓడిపోవడం ఆయన కెరీర్ లోనే దారుణ పరాభవం. కేసీఆర్ తనకు టికెట్ ఇవ్వకపోవడంతో తుమ్మల వీరావేశాలు పోతున్నారు. హైదరాబాదు నుంచి ఖమ్మం రావడానికి భారీ బలప్రదర్శనకు దిగారు.
ఖమ్మంలో కాంగ్రెస్ ఎప్పుడో కళతప్పింది. అక్కడ ఆ పార్టీకి చాలా నియోజకవర్గాలలో సరైన నాయకులు లేరు. దీంతో కాంగ్రెస్ నేతలు అందరూ జిల్లా.. రాష్ట్రస్థాయి.. మండల స్థాయి వాళ్ళు అందరూ తుమ్మల ఇంటికి క్యూ కడుతూ తుమ్మలను కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నారు. ఇటు కాంగ్రెస్కు అటు తుమ్మలకు ఇద్దరికీ వేరే గతి లేదు. ఒకరి ప్రయోజనాల కోసం మరొకరిని ఆశ్రయిస్తున్నారు అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇవన్నీ పక్కన పెడితే తుమ్మల నాగేశ్వరరావు ఎంతో బలమైన నాయకుడిగా చెబుతూ ఉంటారు. జిల్లాలో ఆయన కొన్ని అభివృద్ధి పనులు చేసి ఉండొచ్చు.. అయితే సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండటం.. సుదీర్ఘకాలం మంత్రిగా ఉండటంతో ఆయనకు ఈ అవకాశం వచ్చింది.
వాస్తవంగా తమలకు జిల్లా ప్రజలు ఇచ్చిన గౌరవం.. ఆయనకు వచ్చిన పదవులతో పోలిస్తే ఆయన జిల్లాకు చేసింది తక్కువే అని చెప్పాలి. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో 10 ఏళ్లకు పైగా మంత్రిగా పనిచేసే జిల్లాలో చాలా పనులు అలాగే వదిలేసారని చెప్పాలి. ఇక రాజకీయంగా చూస్తే ఆయన 2004లో సత్తుపల్లిలో జలగం వెంకట్రావు చేతిలో.. 2014లో ఖమ్మంలో పువ్వాడ అజయ్ చేతిలో.. 2018లో పాలేరులో కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోయారు. నిజం చెప్పాలంటే ఈ ముగ్గురికి రాజకీయంగా ఎలాంటి అనుభవం లేదు. తుమ్మలపై గెలిచిన ఆ ముగ్గురికి అవే తొలి ఎన్నికలు.
ఉన్నంతలో జలగం వెంకట్రావు, పువ్వాడ అజయ్ కుమార్ ది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. కందాల ఉపేందర్ రెడ్డి రాజకీయంగా అనామకుడు అనే చెప్పాలి. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన తనకంటే రాజకీయంగా చాలా జూనియర్లు అయిన వారి చేతిలో తుమ్మల ఓడిపోవడం అంటే ఇంకా ఆయన ఎందుకు ? బలవంతుడు అవుతాడు అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. పాలేరు ఉప ఎన్నికల్లో తుమ్మలను గెలిపిస్తే రెండేళ్ల పాటు అసలు నియోజకవర్గ ప్రజలకు ఆయన అందుబాటులో లేరు. ఆ మాటకు వస్తే తుమ్మల అసలు ప్రజల్లో తిరిగేందుకు ఇష్టపడరు. తాను గొప్ప వ్యక్తిని అన్న ఫీలింగ్ ఆయనలో మెండుగా ఉంటుంది. ఇదే ప్రజలకు ఆయనకు మధ్య బాగా దూరాన్ని పెంచేసింది.
కందాళ ఉపేందర్ రెడ్డి కూడా వయస్సులో పెద్ద వ్యక్తే అయినా ఆయన గత ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి నిత్యం ప్రజల్లోనే ఉన్నారు. ఇదే ఆయనకు ఈ రోజు కేసీఆర్ చేయించిన పలు సర్వేలలో ఆదరణ దక్కేలా చేయడంతో పాటు టిక్కెట్ వచ్చేలా చేసింది. ఇక ఇప్పటి వరకు నియోజకవర్గానికి దూరంగా గుండుగుల పల్లిలోనో లేదా హైదరాబాద్లో ఉన్న తుమ్మల ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా 2018 ఫలితంలో మార్పు అయితే ఉండేలా లేదు.