తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ గెలిచి సత్తా చాటాలని చూస్తున్న కేసిఆర్.. తమ పార్టీ నుంచి బలమైన అభ్యర్ధులని ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే మొదట లిస్ట్ విడుదల చేయడంపై ఆయన కసరత్తు చేస్తున్నారు. ఇక దాదాపు అభ్యర్ధులని ఫైనలైజ్ చేశారని తెలుస్తోంది. సుమారు ఓ 20 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు దక్కే అవకాశం మాత్రం లేదని సమాచారం. వారికి ఆల్రెడీ కేసిఆర్..పరోక్షంగా సంకేతాలు ఇచ్చారని తెలుస్తోంది.
కేటిఆర్, హరీష్ ద్వారా..వారిని బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మళ్ళీ బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే తగిన గౌరవం ఇస్తామని చెబుతున్నట్లు తెలిసింది. నియోజకవర్గాల్లో ఓటర్లను బలంగా ప్రభావితం చేసే సామాజిక వర్గాలపైనా బీఆర్ఎస్ అధిష్ఠానం దృష్టి పెట్టింది. ప్రధానంగా సిటింగ్లను మారిస్తే ప్రతికూల ఫలితాలు రాకుండా ఆయా ప్రభావ వర్గాలను పార్టీలోకి రప్పించేందుకు కసరత్తు చేస్తున్నారు.
మరోవైపు పలు నియోజకవర్గాల్లో అసంతృప్తుల సమావేశాలు పెరుగుతున్నాయి. ఫలానా ఎమ్మెల్యేకు ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ఇవ్వరాదంటూ వారు ఎన్నికల హీట్ పెంచుతున్నారు. ఇక ఓవరాల్ గా చూస్తే సీట్లు మార్పు జరిగే అసెంబ్లీ స్థానాలు వచ్చి.. స్టేషన్ ఘన్పూర్, జనగామ, వరంగల్(తూర్పు), కల్వకుర్తి, నాగార్జునసాగర్, కోదాడ, మునుగోడు, వేములవాడ, రామగుండం, జగిత్యాల, కోరుట్ల, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, ఖానాపూర్, వైరా, కొత్తగూడెం, ఇల్లెందు, నర్సాపూర్, జహీరాబాద్, ఉప్పల్, ముషీరాబాద్, అంబర్పేట నియోజకవర్గాల్లో అభ్యర్ధులు మార్పు జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది.
అయితే పక్కాగా ఈ సీట్లలో మార్పులు ఉంటాయని చెప్పడానికి లేదు. ఖచ్చితంగా కొన్నిటిల్లో మార్పు ఖాయం. ఇక ఏ సిట్టింగ్ ఎమ్మెల్యే సీటుకు ఎసరు వస్తుందో చూడాలి.