ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయబోతున్న చిత్రాలు వాల్తేరు వీరయ్య ఒకటి. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ హీరోలుగా నటించారు. శృతిహాసన్, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తే.. సముద్రఖని, రాజేంద్ర ప్రసాద్, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ సినిమాలో భారీ అంచనాలు క్రియేట్ చేశారు. మేకర్స్ ప్రమోషన్స్ తో మరింత బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ బాబీ.. సినిమాకు `వాల్తేరు వీరయ్య` టైటిల్ పెట్టడం వెనక ఉన్న ఇంట్రెస్టింగ్ కథ ను రివిల్ చేశాడు.
`వెంకీ మామ షూటింగ్ సమయంలో నాజర్ గారి ఫ్రెండ్ వచ్చి ఓ పుస్తకం నాకు గిఫ్ట్గా ఇచ్చారు. ఆ బుక్ లో వీరయ్య అనే పేరు నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ టైటిల్తో సినిమా చేయాలనుకున్నాను. అలాగే చిరంజీవి గారు ఇండస్ట్రీకి రాకముంది బాపట్లలో ఆయన నాన్నగారికి ఓ హెడ్ కానిస్టేబుల్ ఐదు వందల ఇచ్చి ఫోటో షూట్ చేయించారు. ఆ ఫోటోలతోనే మద్రాస్ వచ్చానని చిరంజీవి గారు చెప్పారు. ఆ కానిస్టేబుల్ పేరు కూడా వీరయ్య. దీంతో ఈ సినిమాకి వాల్తేరు వీరయ్య తప్ప మరో టైటిల్ ఊహించుకోలేకపోయాను. చిరంజీవి గానికి నచ్చడంతో అదే ఫైనల్ చేశాం` అంటూ బాబీ చెప్పుకొచ్చారు. ఇక లాక్డౌన్ కంటే ముందే ఈ కథను చిరంజీవి గారికి చెప్పానని, అయితే కరోనా తర్వాత ప్రేక్షకుల అభిరుచి మారడంతో చిన్న చిన్న మార్పులు చేసి రవితేజ పాత్రను తీసుకొచ్చానని బాబీ తెలిపాడు.