గత ఎన్నికల నుంచి అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజకవర్గం బాగా టాపిక్ అవుతుంది..ఇక్కడ టీడీపీలోని వర్గ పోరు బాగా హైలైట్ అవుతుంది. కంచుకోట లాంటి నియోజకవర్గంలో వర్గ పోరుతో టీడీపీ ఇంకా బలహీనపడుతుంది. అలాగే టీడీపీ నాయకురాలు బండారు శ్రావణి టార్గెట్ గా సీనియర్ నేతలు రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఆమెని ఎలాగైనా సైడ్ చేయాలనే విధంగా టీడీపీ సీనియర్లు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
జేసీ దివాకర్ రెడ్డి వర్గం అయిన బండారు శ్రావణికి…గత ఎన్నికల్లో శింగనమల టికెట్ దక్కింది. సిట్టింగ్ ఎమ్మెల్యే యామిని బాలపై నెగిటివ్ పెరిగిన నేపథ్యంలో చంద్రబాబు..శ్రావణికి టికెట్ ఇచ్చారు. అయితే జగన్ గాలిలో శ్రావణి ఓటమి పాలయ్యారు. ఓటమి పాలైన నియోజకవర్గంలో యాక్టివ్ గా పనిచేస్తూనే వచ్చారు. కానీ అనంత జిల్లాకు చెందిన కొందరు సీనియర్లు శ్రావణికి చెక్ పెట్టే కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. జేసీ వర్గంలో ఉన్న శ్రావణికి ఎలాగైనా సీటు రాకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదే క్రమంలో నియోజకవర్గంలో తిరుగుతున్న శ్రావణిని అడుగడుగున అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో భాగంగా నియోజకవర్గంలో పర్యటించిన శ్రావణికి సీనియర్లు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలకు ఎందుకు వెళుతున్నారని సీనియర్లు…శ్రావణిని ప్రశ్నించినట్లు తెలిసింది.
అయితే ఇంచార్జ్ హోదాలోనే తాను పర్యటిస్తున్నానని, ఇంచార్జ్ పదవి తీసేస్తే ఆధారాలు చూపించాలని సీనియర్లపై శ్రావణి రివర్స్ అయినట్లు సమాచారం. ఇదే క్రమంలో దళిత మహిళని కావడంతోనే అన్నివర్గాల వారు తనని టార్గెట్ చేస్తున్నారని పార్టీ అధిష్టానం వద్ద శ్రావణి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇక అధిష్టానం ఈ సమస్యని పరిష్కరిస్తే సరే…లేదంటే తన పని తాను చూసుకోవాలని శ్రావణి అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే సీనియర్లు…శ్రావణిని గట్టిగానే టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది…ఆమెకు సీటు రాకుండా చేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి శింగనమల పంచాయితీ ఏం అవుతుందో.