టాలీవుడ్ సినీ చరిత్రలో వచ్చిన అద్భుతమైన క్లాసిక్స్ల్లో మెగాస్టార్ చిరంజీవి – అతిలోక సుందరి శ్రీదేవి నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి ఒకటి. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా సోషియో ఫాంటసీ సినిమాగా తెరకెక్కింది. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్ద సంచలనం క్రియేట్ చేసింది. వైజయంతీ మూవీస్ బ్యానర్పై అగ్ర నిర్మాత అశ్వనీదత్ భారీ బడ్జెట్తో నిర్మించారు. ఈ సినిమా పాటలు ఆంధ్ర దేశాన్ని ఓ ఊపు ఊపేశాయి.
ఈ సినిమా రిలీజ్ అయిన టైంలో భారీ వర్షాలు .. ఓ వారం రోజుల పాటు కలెక్షన్లు బాగా తక్కువుగా ఉండడంతో అందరూ ఆందోళన చెందారు. ఆ తర్వాత సినిమా టాక్ బాగా స్ప్రెడ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. వైజయంతీ మూవీస్ బ్యానర్పై వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో ఈ సినిమాకు ఎప్పుడూ చెక్కు చెదరని స్థానం ఉంది. 1990 మే 9న రిలీజ్ అయిన ఈ సినిమా చిరు కెరీర్లో మాంచి క్లాసిక్గా నిలిచింది.
అప్పటికే శ్రీదేవి బాలీవుడ్ వెళ్లిపోయి అక్కడ టాప్ హీరోయిన్గా కొనసాగుతోంది. ఆమెను తిరిగి టాలీవుడ్లో నటింపజేయాలని అశ్వినీదత్, రాఘవేంద్రరావు పట్టుబట్టి ఒప్పించి ఈ సినిమాలోకి తీసుకువచ్చారు. ఆ రోజుల్లో రు. 9 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రు. 15 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. నిర్మాత అశ్వినీదత్ ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాలో చేసినందుకు చిరంజీవికి రు. 35 లక్షలు, శ్రీదేవికి రు. 25లక్షలు రెమ్యునరేషన్గా ఇచ్చినట్టు చెప్పారు.
అప్పట్లో శ్రీదేవి స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకునేది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తీయాలన్న కోరిక చిరు అభిమానులు, తెలుగు సినీ అభిమానుల్లో బలంగా ఉంది. ఈ సినిమాకు సీక్వెల్ తీస్తే రామ్చరణ్, జాహ్నవీకపూర్ జంటగా నటిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.