ఏపీలో అధికార టీడీపీ వరసు విజయాలతో మాంచి జోష్లో ఉంది. నంద్యాల, కాకినాడ విజయాలతో ఉన్న టీడీపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. సీఎం చంద్రబాబు సైతం ముందస్తుకు రెడీగా ఉండాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులకు ఇప్పటికే సంకేతాలు ఇచ్చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సిట్టింగులుగా ఉండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోన్న ఎమ్మెల్యేల్లో చాలా మందిని ఆయన పక్కన పెట్టేస్తారని కూడా తెలుస్తోంది. ఈ మేరకు ఈ వర్తమానం ఇప్పటికే కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చేరిపోయినట్టు తెలుస్తోంది.
టీడీపీలో సిట్టింగులుగా ఉన్నవారు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రానిపక్షంలో తమ దారి తాము చూసుకునేందుకు స్కెచ్ గీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే చింతలపూడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి పీతల సుజాత కూడా కొత్త పొలిటికల్ దారులు వెతుక్కునే పనిలో బిజీగా ఉన్నట్టు నియోజకవర్గంలోను, జిల్లాలోను గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి. 2004లో ఆచంట నుంచి గెలిచిన పీతల గత ఎన్నికల్లో చింతలపూడి నుంచి చివరి క్షణంలో టిక్కెట్ దక్కించుకుని గెలవడంతో పాటు మంత్రి అయ్యారు.
మూడేళ్ల మంత్రిగా ఆమెపై లెక్కలేనన్ని ఆరోపణలు వచ్చాయి. తీవ్ర విమర్శల నేపథ్యంలో చంద్రబాబు ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించారు. జిల్లాలోనే కాదు స్టేట్లోనే అన్ని మార్కెట్ కమిటీల పాలకవర్గాలు ఓ విడత కంప్లీట్ చేసుకుని రెండో విడత పాలన కొనసాగిస్తున్నా చింతలపూడి ఏఎంసీ పాలకవర్గం ఇంకా భర్తీ కాలేదు. నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలకు ఊతమిచ్చేలా వ్యవహరిస్తోన్న ఆమె తీరుపై ఇప్పటికే చంద్రబాబుకు పలు ఫిర్యాదులు కూడా వెళ్లాయి.
వచ్చే ఎన్నికల్లో పీతలకు టీడీపీ టిక్కెట్ రాదన్న విషయం దాదాపు ఖరారైపోయింది. కొత్త వ్యక్తికి సీటు ఇచ్చేందుకు చంద్రబాబు సమాలోచనలు కూడా చేస్తున్నారు. ఆయన ఇదే విషయాన్ని ఏలూరు ఎంపీ మాగంటి బాబుతో పాటు విఫ్ చింతమనేని ప్రభాకర్తో కూడా చర్చించినట్టు విశ్వసనీయ వర్గాల టాక్. ఇదిలా ఉంటే ఇప్పటికే మంత్రి పదవి పోగొట్టుకున్న సుజాత వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రాకపోతే పార్టీ మారిపోవాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఆమె నియోజకవర్గంలో పార్టీ పరంగా కాకుండా గ్రూపును మెయింటైన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఆమె కొందరు వైసీపీ నాయకులతో కూడా ఇంటర్నల్గా టచ్లో ఉన్నట్టు టాక్. ఒక వేళ పార్టీ మారినా ఆమె తనగ్రూప్ మాత్రం తనతోనే కలిసొస్తుందన్న ఉద్దేశంతో ఇలా చేస్తున్నట్టు సమాచారం. మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే హోదాలో ఉన్న ఆమె కొందరు వైసీపీ నాయకులతో టచ్లో ఉన్నారట. ఇప్పటికే మంత్రి పదవి కోల్పోయిన గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్బాబు కూడా తనకు టిక్కెట్ రాదని డిసైడ్ అయిన ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి, ఎంపీ వైవి.సుబ్బారెడ్డితో టచ్లో ఉన్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇదే క్రమంలో పీతల సుజాత కూడా వచ్చే ఎన్నికలకు ముందుగా వైసీపీలోకి జంప్ చేసేలా ప్లాన్ రెడీ చేసుకుంటున్నట్టు టీడీపీ వర్గాల్లోనే చర్చలు వినపడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ రాదని డిసైడ్ అయిన పీతల వైసీపీ తరపున చింతలపూడి నుంచి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారట. చింతలపూడి వైసీపీ టిక్కెట్ రేసులో ఇప్పటికే దెయ్యాల నవీన్బాబు, ప్రభుత్వ అధికారి జయరాజు, మాజీ మద్దాల రాజేష్ కూడా ఎవరి ఛానెల్లో వారు ట్రై చేసుకుంటున్నారు. మరి సుజాత వైసీపీలోకి జంప్ చేస్తే అప్పుడు టిక్కెట్ కోసం నాలుగు స్తంభాలాట స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ తెలిసిన ఆమె టిక్కెట్టు హామీ వచ్చాక పార్టీ జంప్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు వినికిడి. ఏదేమైనా పీతల సుజాత పార్టీ మార్పు వ్యవహారం ఇప్పుడు జిల్లాలో పెద్ద చర్చనీయాంశమైంది.