టాలీవుడ్లో రెండేళ్ల క్రితం వరకు మిగిలిన స్టార్ హీరోలు చాలా సులువుగా రూ. 40 కోట్లు, 50 కోట్ల మార్క్ క్రాస్ చేస్తుంటే యంగ్టైగర్ ఎన్టీఆర్ మాత్రం రూ. 40 కోట్లు దాటేందుకే ఆపసోపాలు పడేవాడు. రభస సినిమా తర్వాత ఎన్టీఆర్ కథలు ఎంచుకోవడంలో చాలా వరస్ట్ అన్న విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. కెరీర్ ఆరంభంలోనే ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన తారక్.. వరుస ఫ్లాపుల పుణ్యమా అని ఓ దశలో బాగా వెనుకబడిపోయాడు.
అతడి పోటీ హీరోలు అందరూ అతడిని దాటేసి చాలా ముందుకు వెళ్లిపోయారు. రెండున్నరేళ్ల క్రిందట ఎన్టీఆర్ సినిమాలకు రూ. 50 కోట్ల బిజినెస్ జరగడమే చాలా కష్టంగా ఉండేది. టెంపర్ సినిమాతో సక్సెస్ ట్రాక్లోకి వచ్చిన ఎన్టీఆర్ ఆ తర్వాత కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవడంతో వరుసగా టెంపర్ – నాన్నకు ప్రేమతో – జనతా గ్యారేజ్ ఈ మూడూ సూపర్ హిట్లు అయ్యాయి.
ఈ మూడు హిట్లతో ఎన్టీఆర్ రేంజే మారిపోయింది. ఎన్టీఆర్ తాజా సినిమా జై లవకుశకు ఏకంగా రూ. 112 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇది ఏమైనా ప్రత్యేకమైన సినిమానా అంటే.. అదీ కాదు. దీని ప్రోమోలు చూస్తే ఇది మామూలు మసాలా సినిమాలాగే కనిపిస్తోంది. కేవలం థియేట్రికల్ రైట్స్ ద్వారానే ఈ సినిమా రూ. 85 కోట్ల బిజినెస్ చేసింది.
ఇక శాటిలైట్ హక్కులు.. హిందీ డబ్బింగ్ హక్కులు.. ఇతర రైట్స్ కలిపి ఇంకో రూ. 25 కోట్లు వచ్చాయి. ఇక సినిమా బడ్జెట్ రూ. 50 కోట్ల లోపే ఉంటుందని అంటున్నారు. ఈ మూడేళ్లలో ఎన్టీఆర్ మార్కెట్ డబుల్ మించి ట్రిబుల్ దిశగా వెళ్లింది. ఇది సామన్యమైన విషయం కాదు. ఇక ఇటీవల బుల్లితెరమీదకు కూడా వచ్చి క్లాస్ పీపుల్తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఎన్టీఆర్ గ్రాఫ్ మరింత పెరుగుతుందని కూడా అన్ని వర్గాలు అంచనా వేస్తున్నాయి.