తలతన్నేవాడు ఒకడుంటే.. వాడి తాడి తన్నేవాడు మరొకడు ఉంటాడు! అది రాజకీయాలైనా.. మరొకటైనా ఒక్కటే ఫార్ములా. దీనిని తూ.చ. పాటిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు పదునైన అస్త్రాలు ప్రత్యేకంగా ఉండాల్సిన అవసరం లేదని, ఎదుటివారి మాటలు, వారి చేతలే వారికి బ్రహ్మాస్త్రాలుగా ఉపయోగపడతాయని నిరూపించారు చంద్రబాబు. ముఖ్యంగా జగన్ వంటి.. జుట్టు చేతికి ఇచ్చి.. కాళ్లు గెంతులేసే టైపు వారైతే.. బాబుకి మరీ పండగ! విషయంలో వెళ్తే.. మొన్న నంద్యాల ఉప ఎన్నిక ముగిసింది. ప్రస్తుతం కాకినాడ కార్పొరేషన్ ఎన్నిక మిగిలింది.
ఇక్కడ హోరాహోరీ ప్రచారం ఊపందుకుంది. టీడీపీ నుంచి మంత్రులు, వైసీపీ నుంచి ప్రధాన నేతలు క్యూకట్టి మరీ ప్రచారం ముమ్మరం చేశారు. ఈ క్రమంలో నిన్న కాకినాడలో ప్రచారం నిర్వహించిన సీఎం చంద్రబాబు.. జగన్ని ఏకిపారేశారు. సాధారణంగా ప్రతిపక్ష నేతను విమర్శించేందుకు పెద్దగా విషయం ఏమీ ఉండదు. కాబట్టి.. అధికార పక్షం విమర్శల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే అధికార పక్షాన్ని విమర్శించాలంటే.. అనేక విషయాలు కళ్లకు కనిపిస్తుంటాయి. ఇక, ఇప్పుడు ఏపీలో గేర్ రివర్స్ అయింది.
అధికార పక్షాన్ని విమర్శించేందుకు పాత చింతకాయ పచ్చడి వంటి విషయాలనే జగన్ వెతుక్కుంటుండగా.. చంద్రబాబు మాత్రం జగన్ చేసిన తప్పులనే హాట్ హాట్గా వినిపిస్తున్నారు. నంద్యాలలో జగన్ చేసిన కామెంట్లనే ఆయనకు రివర్స్లో కొడుతున్నారు. జగన్ డైలాగులనే బ్రహ్మాస్త్రాలుగా చేసుకుని విరుచుకుపడుతున్నారు ఈ క్రమంలోనే జగన్ అన్న నడిరోడ్డుపై కాల్చేసినా తప్పులేదు, చొక్కా విప్పుతాను, చెప్పుతో కొట్టినా ఫర్వాలేదు.. ఉరేసినా తప్పులేదనిపిస్తోంది. వంటి డైలాగులను చంద్రబాబు ఏకరువు పెట్టారు
ఒక రాష్ట్రానికి సీఎంగా ఉన్న వ్యక్తినే కాల్చి చంపుతానంటున్న వ్యక్తి ఈ రాష్ట్రానికి, ప్రజలకు అవసరమా? అనే సెంటెమెంట్ డైలాగ్ను పేల్చారు సీఎం చంద్రబాబు. దీనికి కాకినాడ ప్రజలు ముక్తకంఠంతో అవసరం లేదని చెప్పేశారు. దీంతో జగన్ గాలి మొత్తం లీకైపోయింది. ఇలాంటి బలమైన వ్యాఖ్యలతోపాటు చంద్రబాబు.. తాను కాకినాడకు ఏం చేసింది, ఏం చేయాలనుకుంది, ఇప్పటి వరకు చేకూరిన లబ్ధి వంటి విషయాలను బలంగా జనంలోకి తీసుకువెళ్తున్నారు. ముఖ్యంగా జగన్ వ్యాఖ్యలను ఆయనపైనే బ్రహ్మాస్త్రం మాదిరిగా వినియోగిస్తుండడం బాబుకు ప్లస్ అవుతుంటే.. జగన్కి డబుల్ మైనస్ అవుతున్నాయి. మొత్తానికి కాకినాడ స్పీడందుకుంది.