నంద్యాలలో టీడీపీ జోరు ముందు వైసీపీ పరువు కూడా దక్కించుకులేని పరిస్థితికి దిగజారింది. ఘోర ఓటమి ఖరారు కావాడంతో వైసీపీ అభ్యర్థి ఏడో రౌండ్ కౌంటింగ్ ముగిసిన వెంటనే నిరాశతో కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయిన ఆయన మీడియాతో మాట్లాడుతూ తన ఓటమి అంగీకరించారు. టీడీపీ భారీ స్థాయిలో డబ్బులు పంచడంతో పాటు సెంటిమెంట్ బలంగా పనిచేయడం వల్లే తాను ఓడిపోయినట్టు ఆయన చెప్పారు.
టీడీపీ ఓటుకు రూ. 2 వేల నుంచి 3 వేల వరకు పంచిందని ఆరోపించిన ఆయన సెంటిమెంట్ బాగా పనిచేయడంతో పాటు మైనార్టీ ఓటర్లు కూడా టీడీపీకే ఓటేయడంతో వైసీపీకి ఆశించిన మేర ఓట్లు రాలేదన్నారు. ఇక తాను రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పిన మాటలపై తర్వాత మాట్లాడుతానన్నారాయన. టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోగా.. వైకాపా నేతలు నిరాశలో కూరుకుపోయారు.
శిల్పాకు మరో షాక్ ఏంటంటే నంద్యాల అర్బన్లో శిల్పా మోహన్రెడ్డి ఇంటి పరిసరాల్లోనూ టీడీపీ ఆధిక్యం కనబర్చడం విశేషం. అయితే ఆయన ఇళ్లు ఉన్న రౌండ్లలో టీడీపీకి 348 ఓట్ల మెజార్టీ మాత్రమే వచ్చింది. ఇక ప్రచార సమయంలో తాను అనారోగ్యం పాలయ్యానని, ఓటర్లకు చేరువ కావడంలో కొంత వెనుకబడ్డానని.. అది కూడా కొంత ప్రతికూలంగా మారిందని శిల్పా మోహన్రెడ్డి చెప్పారు.