ల‌గ‌డ‌పాటి జోస్యం నిజ‌మైంది.. కాకినాడ కూడా సైకిల్‌దేన‌ట‌! 

ఆంధ్రా ఆక్టోప‌స్‌గా గుర్తింపు పొందిన విజ‌య‌వాడ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌.. నంద్యాల ఉప పోరుపై చెప్పిన జోస్యం అక్ష‌రాలా నిజ‌మైంది. అత్యంత ట‌ఫ్‌గా సాగిన ఈ ఉప ఎన్నిక‌పై అందరూ ఏవేవో.. క‌థ‌నాలు , జోస్యాలు చెప్పుకొచ్చారు. అదేస‌మ‌యంలో ల‌గ‌డ‌పాటి కూడా త‌న స‌ర్వే ఫ‌లితాల‌ను వెల్ల‌డించారు. ఇక్క‌డ ఎంత ట‌ఫ్ పోరు సాగినా..భారీ సంఖ్య‌లో జ‌నాలు క్యూక‌ట్టి ఓట్లేసినా.. కూడా వార్ వ‌న్ సైడ్ అయిపోతుంద‌ని, టీడీపీ గెలిచి తీరుతుంద‌ని ఆయ‌న జోస్యం చెప్పారు. అంతేకాదు, మెజార్టీపైనా ఆయ‌న లెక్క‌లు క‌ట్టారు. టీడీపీ క‌నీసం 20 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తుంద‌ని చెప్పుకొచ్చారు.

ఇక‌, సోమవారం ఉద‌యం 8 గంట‌ల‌కు ఓట్ల లెక్కింపు ప్రారంభ‌మైన క్ష‌ణం నుంచి ల‌గ‌డ‌పాటి జోస్యం ఫ‌లిస్తోంది. ప్ర‌తి రౌండ్‌లోనూ టీడీపీ అభ్య‌ర్థి భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి ఆధిక్యం ప్ర‌ద‌ర్శిస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా వైసీపీకి బ‌లంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోనూ బ్ర‌హ్మానంద రెడ్డి రాకెట్ వేగంతో దూసుకువెళ్లాడు. బ్ర‌హ్మానంద‌రెడ్డి ల‌గ‌డ‌పాటి చెప్పిన‌ట్టు 25వేల ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించాడు. దీంతో ఇప్పుడు అంద‌రూ ల‌గ‌డ‌పాటి జోస్యంపై దృష్టి పెట్టారు. ఆయ‌న చెప్పిన ముంద‌స్తు స‌ర్వే ఫ‌లితాలు అక్ష‌రాలా నిజ‌మ‌వుతుండేస‌రికి అంద‌రూ ఆశ్చ‌ర్య పోతున్నారు.

నిజానికి నంద్యాల నాడిని ఎవ‌రూ ప‌ట్టుకోలేక పోయారు. ప్ర‌భుత్వంపై వ్య‌తిరేకత క‌నిపిస్తుంద‌ని, జ‌గ‌న్ ప్ర‌చారం ప్ల‌స్ అవుతుంద‌ని, .,.ఇలా అనేక విధాలుగా అంద‌రూ అంచ‌నాలు వేసుకున్నారు. కానీ, ల‌గ‌డ‌పాటి మాత్రం ఎవ‌రు ఏమ‌నుకున్నా.. త‌న‌కు భ‌యం లేద‌నే ధీమాతో ఆయ‌న ఇక్క‌డ వార్ వ‌న్‌సైడ్ అయిపోవ‌డం ఖాయ‌మ‌ని వెల్ల‌డించారు. అంతేకాదు, రిజ‌ల్ట్ బ‌లాబ‌లాల‌పైనా ఆయ‌న నిక్క‌చ్చిగా తేల్చిచెప్పారు.

ఇక‌, రేపు జ‌ర‌గ‌బోయే కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌పైనా ల‌గ‌డ‌పాటి త‌న స‌ర్వే ఫ‌లితాల‌ను త‌న అనుచ‌రుల వ‌ద్ద వెల్ల‌డించిన‌ట్టు స‌మాచారం. ఇక్క‌డ కూడా టీడీపీ జెండా ఎగ‌ర‌డం ఖాయ‌మ‌ని ఆయ‌న చెప్పిన‌ట్టు స‌మాచారం. మొత్తం 48 స్థానాల్లో 35 వార్డుల‌ను టీడీపీ కైవ‌సం చేసుకుంటుంద‌ని కూడా ల‌గ‌డ‌పాటి వెల్ల‌డించార‌ట‌. మ‌రి ఇదికూడా నిజ‌మైతే.. నిజంగానే వైసీపీ ఇక జెండా పీకేయాల్సిన ప‌రిస్థితి రావ‌డం ఖాయం.