ఏపీ విపక్ష నేతగా బాధ్యతా యుత స్థానంలో ఉండి.. నలుగురికీ ఆదర్శంగా రాజకీయాలు చేయాల్సిన వైసీపీ అధినేత జగన్.. నోటి దురద కారణంగా కోరి కష్టాలు కొని తెచ్చుకున్నారు. అది కూడా తాను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నంద్యాల ఉప పోరుకు ఎన్నిక జరుగుతు సమయంలో కావడంతో ఫలితంపై తీవ్ర ప్రభావం పడుతుందని అంటున్నారు విశ్లేషకులు. విషయంలోకి వెళ్తే.. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం ప్రారంభించేందుకు ముందు టీడీపీలో క్రియాశీలకంగా ఉన్న శిల్పా బ్రదర్స్ని వైసీపీలోకి ఆహ్వానించి టికెట్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన నంద్యాల ప్రధాన గ్రౌండ్లో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన జగన్… ఏపీ సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. నోటికి ఎంత మాట వస్తే.. అంత మాట అనేశారు. అప్పటికే ఎన్నికల కోడ్ అమల్లో ఉందన్న విషయం కూడా మరిచిపోయి.. బాబు పై అనరాని మాటలు అనేశారు. ఈ క్రమంలోనే తనలోని అహంకారాన్నీ, తన అహం భావాన్నీ బయట పెట్టుకున్నారు. బాబు హామీలు అమలు చేయకుండా నాటకాలు ఆడుతున్నారని, మళ్లీ ఏ ముఖం పెట్టుకుని నంద్యాలలో ఓట్లు అడుగుతారని, నీతి, నిజాయితీ అంటూ కబుర్లు చెప్పి రాజకీయ పాఠాలు బోధించే బాబు.. తన 20 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి జంపింగులను ప్రోత్సహించారని ఇలా.. ఓ మాదిరి విమర్శలతో సరిపుచ్చి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది.
అయితే, అలా మాట్లాడితే.. అలా ఆలోచిస్తే.. జగన్ ఎలా అవుతానని అనుకున్నాడో ఏమో.. చంద్రబాబుపై తనకున్న అక్కసునంతా ఆ సభా వేదికగా వెళ్లగక్కాడు. హామీలు నెరవేర్చని బాబును.. నడిరోడ్డుపై కాల్చి చంపినా ఫర్వాలేదని పిస్తోంది అనేసి పెద్ద సంచలనానికి తెరదీశాడు. ఇది దేశ వ్యాప్తంగా కూడా తీవ్ర కలకలం సృష్టించింది. అంతో ఇంతో అటు దేశంలో కొంత గుర్తింపు ఉన్న బాబు ఊరుకుంటారా? టీడీపీ తమ్ముళ్లను ఉసిగొలిపాడు. జగన్ భరతం పట్టాలని, తాను తీసుకున్న గోతిలోనే తాను పడేలా చేయాలని బాబు ఆదేశించాడు. దీంతో టీడీపీ నేతలు రెచ్చిపోయారు.
అంది వచ్చిన అవకాశంగా జగన్ వ్యాఖ్యను దేశవ్యాప్తంగా ప్రచారం చేసి.. రచ్చ చేయడమే కాకుండా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేశారు. కోడ్ ఉండడంతో దీనిని తీవ్రంగానే పరిగణించిన రాష్ట్ర ఎన్నికల సంఘం జగన్కు షో కాజ్ పంపింది. అయితే, తనకు బాబు పట్ల ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదని, ఆవేదనతోనే అన్నానని జగన్ చెప్పారు. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం దీనికి ఫుల్ స్టాప్ పెట్టింది. అయితే, జగన్ని ఇంతటితో వదిలేయరాదని నిర్ణయించిన టీడీపీ ఈ నోటి దూల వ్యాఖ్యలను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది.
ఇంకేముంది. అనుకున్నంతా అయింది. కఠినంగా వ్యవహరించాలంటూ.. కేంద్ర ఎన్నికల సంఘం బాస్.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేశారు. అది కూడా నంద్యాలలో ఎన్నిక ప్రారంభమైన కొన్ని గంటలకే ఈ విషయం బయటకు పొక్కడంతో జగన్ వ్యతిరేక మీడియా దీనిని చిలవలు పలవలు చేసి ప్రసారం చేయడం మొదలు పెట్టింది. దీనిని తప్పుపట్టేందుకు అవకాశం కూడా లేదు. దీంతో జగన్కి ఇప్పుడు సంకట స్థితి ఏర్పడింది.
ఈసీ ఆదేశాలు ఒక పక్క వ్యక్తిగతంగా తనకు, మరోపక్క, తాను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నంద్యాలపైనా ప్రభావం చూపించక తప్పదని భావిస్తూ.. తీవ్రంగా నలిగిపోతున్నట్టు సమాచారం. మొత్తానికి నోటి దూలను ఎంత కంట్రోల్ చేసుకోవాలో జగన్కి ఇప్పటికైనా తెలిస్తే.. మంచి దని అంటున్నారు విశ్లేషకులు. మరి జగన్ మారతాడా?! ఇక, కఠిన చర్యలు అంటే రాష్ట్ర ఎన్నికల సంఘం ఏం చేస్తుందో చూడాలి.