వైసీపీ అధినేత జగన్ కెరీర్లోనే తీవ్రమైన సందిగ్ద స్థితిలో ఉన్నట్టే కనిపిస్తోంది. ముంచుకొస్తోన్న 2019 ఎన్నికలు, బలమైన చంద్రబాబు లాంటి రాజకీయ ప్రత్యర్థిని ఎదుర్కోవడం పెద్ద సవాల్. ఇక ఇప్పటికిప్పుడు నంద్యాల ఎన్నికలు చావోరేవోలా ఉన్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు జగన్కు తన ఫ్యామిలీని సంతృప్తి పర్చడం కూడా పెద్ద సవాల్గా మారింది. గత ఎన్నికలకు ముందు నుంచి సోదరి షర్మిలకు జగన్కు మధ్య గ్యాప్ పెరిగిపోయింది.
షర్మిల కడప లేదా ఖమ్మం ఎంపీ సీటు ఆశించినా జగన్ మాత్రం ఆమెకు సీటు ఇవ్వలేదు. తర్వాత ఎమ్మెల్సీ సీటు ఆశించినా ఆ కోరిక కూడా నెరవేరలేదు. ఆమెను ఎదోలా దగ్గరకు చేర్చుకుంటున్నాడు అనుకుంటోన్న టైంలో జగన్కు ఇప్పుడు సొంత సోదరుడితోను గ్యాప్ వచ్చినట్టే కనపడుతోంది. కడప జిల్లా వైసీపీ నేతల్లో ఇప్పుడు ఇదే రకమైన చర్చ నడుస్తోంది.
ప్రస్తుతం కడప ఎంపీగా ఉన్న అవినాష్రెడ్డి జగన్ బాబాయ్ మనోహర్రెడ్డి కుమారుడు. వాస్తవానికి ఈ సీటునుంచి జగన్ మరో బాబాయ్, మాజీ మంత్రి వైఎస్.వివేకానందరెడ్డి ప్రాథినిత్యం వహించారు. గత ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్లో ఉండడంతో చివరకు జగన్ ఈ సీటును అవినాష్కు ఇచ్చారు. ఇక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్న అవినాష్ జిల్లాలో పార్టీ రోజు రోజుకు వీక్ అవుతున్నా ఆయన మాత్రం పట్టించుకోవడం లేదన్న రిపోర్ట్ జగన్ వద్దకు వెళ్లిపోయింది.
ఇక కొద్ది రోజుల క్రితం జరిగిన కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లోను అవినాష్ సరిగా పనిచేయడం లేదని, అందుకే వివేక ఓడిపోయాడని కూడా జగన్ ఫైర్ అయినట్టు టాక్. అప్పటి నుంచి అవినాష్ను జగన్ క్రమక్రమంగా పక్కన పెట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో ఎంపీ సీటును వివేకకు ఇవ్వాలని డిసైడ్ అయినట్టు వార్తలు వస్తున్నాయి.
ఇక బాబాయ్కు ఎంపీ సీటు ఇవ్వాలని డిసైడ్ అయిన జగన్ తమ్ముడి రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇవ్వకపోవడంతో వైఎస్ కుటుంబంలో అసంతృప్తి స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. మరి జగన్ అవినాష్ పొలిటికల్ ఫ్యూచర్ ఎలా డిసైడ్ చేస్తాడో ? చూడాలి