కుల రాజకీయాలపై వైసీపీ అధినేత వైఎస్.జగన్ ఆసక్తికరంగాను, సామరస్యపూర్వకంగాను మాట్లాడారు. కొద్ది రోజులుగా పశ్చిమగోదావరి జిల్లా గరగపర్రులో దళితులకు, దళితేతరులకు మధ్య వార్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుపై చెలరేగిన గొడవ కాస్తా పెద్దదిగా మారిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన దళిత నాయకులు సైతం అక్కడకు చేరుకుని గరగపర్రులో బాధితులను పరామర్శిస్తున్నారు.
ఈ కోవలోనే వైసీపీ అధినేత వైఎస్.జగన్ సైతం శుక్రవారం గరగపర్రుకు వెళ్లి అక్కడ సాంఘిక బహిష్కరణకు గురైన దళితులను పరామర్శించారు. ఈ సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. చాలా మంది దళితులు తమను అన్యాయంగా సాంఘీక బహిష్కరణ చేశారని, పనులకు రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహం పెట్టడమే తాము చేసిన నేరమా ? అని ప్రశ్నించారు.
ఇక బాధితులతో మాట్లాడిన జగన్ కమ్యునికేషన్ గ్యాప్ వల్లే ఈ వివాదం పెరిగిందని దళితేతరులు చెపుతున్నారు. ఇలాంటి పరిణామాలు రాకూడదని వారంటున్నారు… తప్పు చేసిన వారికే శిక్షలు పరిమితం కావాలని దళితులు చెపుతున్నారు… వివాద పరిష్కారానికి మనమందరం ముందడుగు వేయాలని జగన్ చెప్పారు. కుల రాజకీయాలు ఏకుండా అందరూ కలసి మెలిసి ఉండాలని జగన్ చెప్పారు. ఇక ఈ సమస్య పరిష్కారానికి పార్టీ తరపున కమిటీ వేస్తుందని, రెండు వర్గాలు కలిసిమెలిసి ఉండేందుకు కమిటీ కృషి చేస్తోందని జగన్ చెప్పారు.