ఎట్టి పరిస్థితిలోనూ 2019 నాటికి ఏపీలో సీఎం పీఠం ఎక్కితీరాలి! ఇది వైసీపీ అధినేత జగన్ గట్టి నిర్ణయం! అలా కాని పక్షంలో ఆయన తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోవడం ఖాయం. ఇది నిజం!! అంతేకాదు, ఆయన పార్టీ మనుగడకు కూడా పెద్ద ముప్పే.. ఇప్పటికే సగం మంది వైసీపీని వదిలిపెట్టేశారు. మిగిలిన వాళ్లు కేవలం 2019పైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు జగన్ ఆశలు.. ఆకాంక్షలు.. అన్నీ 2019 పైనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయన గెలుపు గుర్రం ఎక్కేందుకు అన్ని మార్గాలనూ అన్వేషిస్తున్నారు.
ఈ నేపథ్యంలో 2014లో ఢిల్లీలో గద్దెనెక్కిన నరేంద్ర మోడీకి సలహాలు, సూచనలు చేసిన ఎన్నికల సలహాదారు, పరిశీలకుడు ప్రశాంత్ కిషోర్ను ఎన్నికలకు రెండు సంవత్సరాల ముందే తనకు సలహాదారుగా జగన్ నియమించుకున్నారు. దీంతో ప్రశాంత్ ఇప్పటికే తన పనిప్రారంభించేశాడు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఉన్న భారతీ సిమెంట్స్ ఆఫీస్లో ఎకాఎకి దిగిపోయిన ఆయనకు సమీపంలోని మరో మూడంతస్థుల భవనాన్ని నెలకు రూ.లక్ష చొప్పున చెల్లించేలా అద్దెకు తీసుకున్నారు.
ఇక, ఈ రెండేళ్ల మొత్తానికి జగన్.. ప్రశాంత్ కిషోర్తో చేసుకున్న డీల్ కూడా భారీగానే ఉందని వినికిడి. దాదాపు రూ.250 కోట్ల ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం. ఇంత భారీ మొత్తం వెచ్చిస్తున్న జగన్.. మొత్తం భారం అంతా ప్రశాంత్పైనే పెట్టేశారట. అయితే, 2019 ఎన్నికలు అంత వీజీకావనే విషయం అందరికీ తెలిసిందే. ఒక పక్క పవన్, మరోపక్క టీడీపీ, బీజేపీ కూటమి, వామపక్షాలు, పుంజుకున్న కాంగ్రెస్ ఇవన్నీ జగన్ ఆశలపై నీళ్లు చల్లేవే. అయినా కూడా ప్రశాంత్ వంటి ఉద్ధండుడు ఉంటే గెలుపు నల్లేరుపై నడకేనని భావిస్తున్న జగన్కు భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియాలంటే.. 2019 వరకు వేచి ఉండాల్సిందే.