తెలంగాణ సీఎం కేసీఆర్ దెబ్బతో అధికార టీఆర్ఎస్కు చెందిన ఓ ఎమ్మెల్యేకు జ్వరం పట్టుకుందట. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ తనకు టిక్కెట్ ఇవ్వనన్న ఫ్రీలర్లు వదలడంతో ఇప్పుడు సదరు ఎమ్మెల్యే తన బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక మల్లగుల్లాలు పడుతున్నారట. ఇక తెలంగాణలో అధికార టీఆర్ఎస్కు చెందిన చాలా మంది ఎంపీలు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఈ జాబితా చాలానే ఉంది. ఈ జాబితాలోకి కొత్తగా వచ్చి చేరారు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి.
వచ్చే ఎన్నికల్లో ఆయన సీఎం కేసీఆర్ సొంత జిల్లాలోని సిద్ధిపేట జిల్లాలో దుబ్బాక సీటు నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొత్తగా రెడీ అవుతున్నారు. వాస్తవానికి ఆయన గత ఎన్నికల్లోనే దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నారు. దుబ్బాక ఆయన సొంత నియోజకవర్గం. అయితే సోలిపేట రామలింగారెడ్డి కోసం అక్కడ నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు పట్టుబట్టడంతో కేసీఆర్ ప్రభాకర్రెడ్డికి టిక్కెట్ ఇవ్వలేదు.
ఈ క్రమంలోనే తాను రాజీనామా చేసిన మెదక్ ఎంపీ సీటును ప్రభాకర్రెడ్డికి ఇవ్వడంతో ఆయన ఎంపీగా భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఇక తాజా సర్వేల్లో సోలిపేటపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో కేసీఆర్ ఆయన్ను పక్కన పెట్టేయాలని డిసైడ్ అయ్యారు. ఈ ఒక్క ఇష్యూనే కాదు చాలా అంశాలు సోలిపేటకు ప్రతికూలంగా మారుతున్నాయి. నియోజకవర్గంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులు ఎక్కువ మంది ఉన్నారు.
ఇక యేడాది కాలంగా ఇక్కడ వేముల ఘాట్లో నిరాహారదీక్షలు చేస్తున్నారు. ఇక్కడ నిర్వాసితులను ఒప్పించడంలో ఎమ్మెల్యే సోలిపేట ఘోరంగా విఫలమవ్వడంతో కేసీఆర్ ఆయనపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. పనితీరు పరంగాను ఆయనకు మంచి మార్కులు రాలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో సోలిపేటకు కాకుండా ప్రభాకర్ రెడ్డికే ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్లు గులాబీ పార్టీలో జోరుగా ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ఈ విషయం సోలిపేటకు తెలియడంతో ఆయనకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ వస్తుందా ? రాదా ? అన్న డౌట్తో ఆయన గుండెళ్లో రైళ్లు పరిగెట్టేస్తున్నాయని టాక్.