పొలిటికల్గా కొంత ఫైర్ బ్రాండ్గా ఉండే తెలంగాణ టీడీపీ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇప్పుడు సెంటారాఫ్ది టాపిక్గా మారిపోయాడు. రెండు రోజుల కిందట తెలంగాణలో టీడీపీ మహానాడు జరిగింది. దీనికి పెద్ద ఎత్తున టీడీపీ నేతలు హాజరయ్యారు. దీనికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కూడా హాజరై దిశానిర్దేశం చేశారు. అయితే, ఈ సందర్భంగా చోటు చేసుకున్న కొన్ని పరిణాలు ఇప్పుడు ఆసక్తి కరంగా మారాయి.
ఈ కార్యక్రమానికి మొత్తం రేవంత్ అన్నీ తానై వ్యవహరించాడు. ఇదే సమయంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. మహానాడు కార్యక్రమంలో మాట్లాడేందుకు రేవంత్ రెడ్డి మైక్ అందుకోగానే కార్యకర్తల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. రేవంత్ ను మాట్లాడమంటూ ఆహ్వాన సూచకంగా దాదాపు ఓ రెండు నిమిషాలపాటు ప్రాంగణమంతా మార్మోగిపోయింది. దీంతో కొంతమంది టీడీపీ నేతలు అవాక్కు అయ్యారనే చెప్పాలి. వేదికపై ఉన్న చంద్రబాబు కూడా రేవంత్ కు వస్తున్న స్పందనను కాసేపు చూస్తూ ఉండిపోయారు!
రేవంత్ పాపులారిటీ ఇలా ఉందన్నమాట. రేవంత్ రెడ్డి తన సహజ శైలిలో ప్రసంగించడం కూడా ప్లస్ అయిందని చెప్పుకోవాలి. చంద్రబాబు కంటే రేవంతుడే నయం అనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లింది. సో… తెలంగాణలో జరిగిన తొలి మహానాడు రేవంత్ కి ఆ విధంగా కలిసి వచ్చిందనే చెప్పుకోవాలి. దీనినిబట్టి.. రేవంత్ ఫాలోయింగ్ విషయంపై ఓ క్లారిటీ వచ్చేసిందనే అంటున్నారు విశ్లేషకులు. నిన్న మొన్నటి వరకు టీఆర్ ఎస్ను వ్యతిరేకించి వార్తల్లో నిలిచిన రేవంత్ ఇప్పుడు తనకంటూ సొంతంగా రేటింగ్ పెంచుకోవడంపై అందరూ ఆశ్చర్యంగా చర్చించుకుంటుండడం విశేషం.