వైకాపా అధినేత జగన్కి పట్టరాని కోపం వచ్చిందా? తన సొంత పార్టీ నేతలకే ఆయన క్లాస్ పీకారా? అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. సోమవారం లోటస్ పాండ్లో జరిగిన సమావేశంలో తన సొంత పార్టీ జిల్లాల ఇన్చార్జులకు, నేతలకు జగన్ భారీస్థాయిలో క్లాస్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వాస్తవానికి 2019 ఎన్నికల విషయంలో జగన్ చాలా సీరియస్గా ఉన్న విషయం తెలిసిందే. 2014లోనే కొద్ది తేడాతో తప్పిపోయిన ఏపీ అధికార పీఠాన్ని ఎట్టి పరిస్థితిలోనూ 2019లో సాధించి తీరాలని గట్టి కసిమీద ఉన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే చంద్రబాబు పాలనను విమర్శించడం, ప్రజల్లో వైకాపాకు ఆదరణ పెంచుకోవడంపైనే జగన్ దృష్టి పెట్టారు. ప్రత్యేక హోదా సహా ఏది అంది వస్తే.. దానిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు జగన్ ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరింత గా ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్దేశించిన కారక్రమంగా గడప గడపకు వైసీపీ కార్యక్రమాన్ని ఆయన మూడు మాసాల కిందట ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని హిట్ చేయడం ద్వారా ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచడం సహా వైకాపాకి మంచి ఆదరణ లభించేయాలని చేయాలని వ్యూహం సిద్ధం చేసుకున్నారు.
దీంతో ఈ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితిలోనూ సూపర్ డూపర్ హిట్ చేయాలని ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా జిల్లా పార్టీ ఇంచార్జ్లకు కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. అయితే, కొందరు జిల్లా ల ఇంచార్జ్లు మాత్రం దీనిని లైట్ తీసుకున్నట్టు అధినేతకు వార్తలు అందాయి. దీంతో జగన్ ఆగ్రహోదగ్రుడై.. ఆయా ఇంచార్జుల భరతం పట్టారు. గడపగడపకు కార్యక్రమంపై దృష్టి పెట్టకపోవడానికి గల కారణాలేమిటో చెప్పాలని ఆయన నిలదీశారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయమే ఉన్నప్పటికీ… ప్రభుత్వ వైఫల్యాలను జనానికి వివరిస్తే… జన బాహుళ్యంలో పార్టీకి పట్టు పెరుగుతుందని, అలా చేయకపోతే మనం, మన పార్టీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకోండి! అన్నట్టు తెలిసింది.
”గడపగడపకు కార్యక్రమం ద్వారా జనం వద్దకు వెళితే… జనానికి దగ్గరయ్యేది మీరే. జనానికి దగ్గరైతేనే వచ్చే ఎన్నికల్లో మీరు గెలుస్తారు. మీ గెలుపు కోసమే ఈ కార్యక్రమానికి పక్కాగా ప్రణాళిక రచించాం. విపక్షంలో ఉన్న పార్టీకి ఇబ్బందులు తప్పవన్న విషయం కాదనలేని సత్యం. అయితే ఇబ్బందుల మాట చెప్పి గడపగడపకు కార్యక్రమాన్ని పక్కనబెడితే… ఓడేది మీరే. మీ కోసం సంకల్పించిన కార్యక్రమాన్ని మీరే నిర్లక్ష్యం చేస్తే ఎలా? ఇప్పటినుంచైనా ఈ కార్యక్రమంపై పార్టీ సీనియర్ల వద్ద నుంచి గ్రామ స్థాయి నేతలు కూడా తప్పనిసరిగా దృష్టి సారించాల్సిందే” అని జగన్ చెప్పుకొచ్చారు.