ఇదేంటి? అనుకుంటున్నారా.. ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ సీనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ సెంటిమెంట్తో సతమతమైపోతున్నారట. సీనియర్ ఎన్టీఆర్ గతే తనకు కూడా పడుతుందా? అని తెగ భయపడుతున్నట్టు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఆ.. కాంగ్రెస్ విపక్షం కదా.. ఇలానే చెబుతుందిలే అనుకుంటున్నారా? అలేఏమీకాదు.. వాళ్లు వాస్తవాలు, రుజువులతో సహా కేసీఆర్ భయానికి సంబంధించిన విషయాన్ని వివరిస్తున్నారు. మరి అదేంటో చూద్దాం. తెలంగాణ సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టినప్పటినుంచి ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని కూలగొట్టి.. వేరో చోట ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో నిర్మించాలని ఆయన భావిస్తున్నారు.
ఈ క్రమంలో అనేక మంది కేసీఆర్ ప్రతిపాదనను తీవ్రంగా తప్పుపట్టారు. అయితే, కేసీఆర్ మాత్రం ప్రస్తుతం ఉన్న సచివాలయం వాస్తుపరంగా బాగోలేదని, వాస్తు బాగుంటేనే బంగారు తెలంగాణ సాధ్యం అవుతుందని ఆయన చెబుతూ వస్తున్నారు. ప్రస్తుతం మరో వారం లేదా పదిరోజుల్లో దీనికి సంబంధించిన కీలక నిర్ణయం ఆయన తీసుకోనున్నారు. దీంతో ప్రభుత్వ ఖజానాపై దాదాపు 350 కోట్ల వరకు భారం పడే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో దీనిని అందిపుచ్చుకున్న విపక్ష కాంగ్రెస్ నేతలు కేసీఆర్ను ఏకేసేందుకు సిద్ధమయ్యాయి. ఆయన వాస్తు బాగోలేక సచివాలయం పడగొట్టడం లేదు… కేవలం ఎన్టీఆర్ సెంటిమెంట్తోనే పడగొడుతున్నారంటూ కొత్త సబ్జెక్ట్ను తెరమీదకి తెచ్చారు.
గతంలో ఎన్టీఆర్ ఉన్న సమయంలో ఆయన పార్టీలో చంద్రబాబు వర్గం విడిపోయింది. దీంతో ఎన్టీఆర్పై అందరూ యుద్ధం ప్రకటించారు. ఫలితంగా ఎన్టీఆర్ అప్పట్లో ఒంటరి అయిపోగా.. చంద్రబాబు పాలనా పగ్గాలు చేపట్టారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి రాబోతోందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. సీఎం కేసీఆర్ మేనల్లుడు హరీష్రావు.. త్వరలోనే మామకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చే సూచనలున్నాయని కేసీఆర్ భావిస్తున్నారని, అందుకే సచివాలయాన్ని పడగొట్టించి ఆ గండం నుంచి తనను తాను కాపాడుకోవాలని చూస్తున్నారని చెబుతున్నారు.
అంతేకాకుండా రాష్ట్ర చరిత్రలో సీఎం తనయుడు సీఎం అయిన ఉదంతం లేదని, కానీ, సీఎం అల్లుడు సీఎం అయిన సందర్భం చంద్రబాబుతో మొదలైందని, ఈ క్రమంలోనే కేసీఆర్ ఇలా చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్కు తన కుమారుడు కేటీఆర్ను సీఎం చేయాలని ఉందని అయితే ప్రస్తుత సచివాలయం ఉంటే అదిసాధ్యం కాదని భావిస్తున్న కేసీఆర్ దానిని కూలగొట్టాలని చూస్తున్నారని విమర్శిస్తున్నారు.
ఇక, ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు.. . సచివాలయం కూల్చివేత అంశంపై జీవన్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ లు సోమవారం నాడు గవర్నర్ నరసింహన్ ను కలసి వినతిపత్రం అందజేశారు. సచివాలయం పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేయడం సరికాదని గవర్నర్ కు ఇచ్చిన ఫిర్యాదులో నేతలు పేర్కొన్నారు. మరి కాంగ్రెస్ నేతల కొత్త స్టోరీకి కేసీఆర్ అండ్ కో.. ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.