కబాలీ సినిమా తర్వాత సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం రోబో 2.0 సినిమా చేస్తున్నాడు. ఏ వన్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. రోబో 2.0 పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ సినిమా తర్వాత రజనీ ఇక సినిమాలు చేయడని..రెస్ట్ తీసుకుంటాడన్న ప్రచారం జరిగింది. అయితే రజనీ సినిమాలు ఆపడం సంగతేంటో గాని వరుసపెట్టి సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు.
రోబో 2.0 తర్వాత రజనీ అల్లుడు ధనుష్ నిర్మించే సినిమాకు రజనీ ఓకే చెప్పాడు. ఈ సినిమాకు కూడా కబాలీ డైరెక్టర్ రంజిత్ దర్శకత్వం వహించనున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటు లారెన్స్ చెప్పిన ఓ కథకు కూడా రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రజనీకి ఉన్న కోట్లాది మంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ లో లారెన్స్ కూడా ఒకడు.
ఒకప్పుడు రజనీ సినిమాలకు చిన్న స్టెప్ కంపోజ్ చేస్తే చాలని గర్వంగా ఫీల్ అయిన లారెన్స్ ఆ కోరిక ఎప్పుడో నెరవేర్చేసుకున్నాడు. ఇప్పుడు ఏకంగా రజనీని డైరెక్ట్ చేసే స్థాయికి ఎదిగిపోయాడు. కాంచన, ముని, గంగ లాంటి హర్రర్ జానర్లో సినిమాలు తీసి హిట్లు కొట్టి స్టార్ డైరెక్టర్గా మారిపోయాడు లారెన్స్.
లారెన్స్ తాజాగా రజనీకి చంద్రముఖి స్టైల్లో అదిరిపోయే స్టోరీని చెప్పడంతో రజనీ ఆ కథకు ఓకే చెప్పినట్టు సమాచారం. కబాలీ దర్శకుడి సినిమాను ముందుగా పట్టాలెక్కిస్తాడా ? లేదా లారెన్స్ సినిమాను రజనీ స్టార్ట్ చేస్తాడా ? అన్నది చూడాలి.