రెండు తెలుగు రాష్ట్రాలను గడగడలాడించిన గ్యాంగ్ స్టర్ నయీంతో షోల్డర్ షోల్డర్ కలిపి పనులు చక్కబెట్టుకున్న నేతల వివరాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్న విషయం తెలిసిందే. నయీంతో అంటకాగిన వారు ఎంతటి వారైనా చర్యలు తప్పవని కేసీఆర్ వెల్లడించిన నేపథ్యంలో సిట్ అధికారులు దూకుడు ప్రదర్శించారు. ఈ క్రమంలో నయీంతో చట్టాపట్టాలేసుకుని తిరిగి దందాలు చేసినవారి పేర్లను సిట్ ప్రభుత్వానికి అందజేసింది. దీనిలో ప్రముఖంగా బయటకు వచ్చిన పేరు నేతి విద్యాసాగర్రావు. ప్రస్తుతం ఈయన తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా ఉన్నారు.
అయితే, గతంలో నయీంతో ఈయన పెద్ద ఎత్తున లావాదేవీలు నిర్వహించాడని మొన్నామధ్య పూర్తిస్థాయిలో వార్తలు వచ్చాయి. బినామీ పేర్లతో స్థలాలను రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టారు. ఈ క్రమంలో కేసీఆర్ ఆయనపై ఫైరయ్యారని సమాచారం. అంతేకాకుండా పదవికి రాజీనామా చేసేలా ఆయనను ఆదేశించారని కూడా తెలిసింది. ఇలా చేయడం ద్వారా సొంత పార్టీ నేతలపైనే తొలి చర్య తీసుకుని తర్వాత ఎవరిపై చర్య తీసుకున్నా ఎలాంటి ఇబ్బందీ ఉండదని కేసీఆర్ భావించారు.
దీంతో దీపావళి వెళ్లాక నేతి తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా సమర్పించినట్టు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అయితే, కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగానే నేతి తన పదవి నుంచి తప్పుకోనున్నారు. దీంతో నేతి ప్లేస్లో సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు నారదాసు లక్ష్మణరావు డిప్యూటీ చైర్మన్గా పగ్గాలు చేపడుతారని తెలుస్తోంది. ఇక, నేతి తర్వాత మరెంత మందిపై కేసీఆర్ కత్తి ఝళిపిస్తారో చూడాలి! మొత్తానికి ఇప్పటికైతే నయీం కేసులో ఫస్ట్ వికెట్ పడిపోనుంది!