ఏపీ రాజధాని నిర్మాణ వ్యవహారాన్ని స్విస్ చాలెంజ్ పద్ధతిలో చంద్రబాబు ప్రభుత్వం సింగపూర్ కన్సార్టియానికి కట్టబెట్టింది. అదే సందర్బంలో న్యాయపరమైన ఇబ్బందులన్నీ లండన్ కోర్టులో తేల్చుకోవాలని ఒప్పందం చేసుకుంది. అంటే భవిష్యత్తుల్లో సింగపూర్ కన్సార్టియం లాభాలకు గ్యారంటీ ఇచ్చిన ప్రభుత్వం ఒకవేళ పరిస్థితులు తారమారయితే మాత్రం లండన్ కోర్టు బోనెక్కాల్సి ఉంటుంది. ఏపీ ప్రభుత్వం అంటే మనందరి పరిస్థితి దోషులుగా నిలవాల్సి ఉంటుంది.
సింగపూర్ కంపెనీల లాభాల కోసం మన రాజధాని కడుతున్న చందంగా పరిస్థితులు మార్చేసిన చంద్రబాబు పుణ్యాన మన చట్టాలు..మన కోర్టులు కాకుండా మన రాజధాని నిర్మిస్తున్న కంపెనీకి లండన్ కోర్టులో సమాధానం చెప్పుకోవాల్సి వుంటుంది. వాడికి కోపం వచ్చినా మనదే తప్పు..మనకు ఇబ్బంది కలిగినా మనమే సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందన్న చందంగా ఇప్పుడు స్విస్ ఛాలెంజ్ లో ఒప్పందాలు చేసుకోవడంతో భవిష్యత్తు మన పరువు మరోసారి బజారుపాలుకావడం ఖాయం.
అంతర్జాతీయ ట్రిబ్యూనల్ తీర్పు ఒకటి వెలువడింది. స్ప్రెక్ట్రమ్ కేటాయింపుల రద్దు విషయంలో కేంధ్రానికి మొట్టికాయలు వేసింది. ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. మన దేశానికి ఏడు వేల కోట్ల పరిహారం చెల్లించాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేసింది. హేగ్ లో నమధ్యవర్తిత్వ ట్రిబ్యునల్ తీర్పుతో ఇప్పుడు కేంధ్రానికి ముచ్చెమటలు పడుతున్నాయి. తీర్పు ఎలా ఉన్నప్పటికీ స్ప్రెక్ట్రమ్ కేటాయింపుల రద్దు నిర్ణయం సరైనదేనని సర్థి చెప్పుకుంది. కానీ పరిహారం విషయంలో మాత్రం ఇప్పుడు ఏం చేయాలన్నదానిపై మల్లగుల్లాలు పడుతోంది. మనదగ్గరకు వస్తున్న సింగపూర్ కంపెనీలు మన రాష్ట్రానికి అసలే అంతంతమాత్రంగా ఉన్న ఆదాయాన్నంతా కాజేస్తాయి. అయినా వాటికి లాభాల ఆకలి తీరకపోతే ఆ వెంటనే లండన్ లో కోర్టుకెక్కుతాయి. మన ముక్కులు పిండి వసూలు చేసి కట్టించుకోవడానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకుంటాయి.
అంటే ఒకప్పుడు బ్రిటీష్ రాజ్యంలో ఏం జరిగినా లండన్ నుంచి మహారాణి గారీ ఆదేశాల మేరకు మనదేశంలో వ్యవహారాలు సాగేవి. ఇప్పుడు కూడా మన రాజధాని నిర్మాణంలో లండన్ కోర్టు, సింగపూర్ కన్సార్టియం చేతుల్లో మన భవిష్యత్తు నలిగిపోబోతోందని ఈ హేగ్ ట్రిబ్యూనల్ తీర్పు ద్వారా మరోసారి స్పష్టమయ్యింది. అయితే అప్పుడు కోర్టుకి చంద్రబాబు వెళతారా అంటే సమాధానం చెప్పలేం. ఆనాటికి ఎవరు అధికారంలో ఉంటే వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంటే చంద్రబాబు చేసుకున్న ఒప్పందాల పుణ్యం ఆ తర్వాత వచ్చేవారంతా అనుభవించక తప్పదు.