ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్దగా కలిసొచ్చే నియోజకవర్గాలు లేవనే చెప్పాలి..గత నాలుగు ఎన్నికల నుంచి జిల్లాలో టిడిపి సత్తా చాటడం లేదు..కానీ అంతకముందు జిల్లాలో టిడిపి మంచి విజయాలే సాధించింది. అలా మంచి విజయాలు సాధించిన స్థానాల్లో జమ్మలమడుగు ఒకటి అని చెప్పవచ్చు. 1983 నుంచి 1999 వరకు వరుసగా అయిదుసార్లు టిడిపి గెలిచింది. మూడుసార్లు పొన్నపురెడ్డి శివారెడ్డి, రెండుసార్లు పొన్నపురెడ్డి సుబ్బారెడ్డి గెలిచారు.
2004 నుంచి అక్కడ సీన్ రివర్స్ అయింది..2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఆదినారాయణ రెడ్డి గెలిచారు. 2014లో వైసీపీ నుంచి ఆయనే గెలిచారు. ఆ తర్వాత ఆయన టిడిపిలోకి వచ్చారు. ఇక 2019లో ఆదినారాయణ కడప ఎంపీగా పోటీ చేయగా, సుబ్బారెడ్డి నాల్గవసారి జమ్మలమడుగులో పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఎన్నికలు అయ్యాక ఆదినారాయణ టిడిపిని వదిలి బిజేపిలోకి వెళ్లారు. అటు సుబ్బారెడ్డి ఏమో వైసీపీలోకి వెళ్లారు. ఇలా ఇద్దరు నేతలు వెళ్లిపోవడంతో జమ్మలమడుగులో టిడిపికి బలమైన నాయకులు లేకపోయారు.
అటు వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ఎదురులేదనే పరిస్తితి..ఇదే క్రమంలో టిడిపిలో ఆదినారాయణ సోదరుడు కుమారుడు భూపేష్ రెడ్డి యాక్టివ్ అయ్యారు. ఆయనకే ఇంచార్జ్ పదవి ఇచ్చారు. దీంతో దూకుడుగా పనిచేస్తున్నారు. తాజాగా యువగళం పాదయాత్ర జమ్మలమడుగులో జరిగింది. లోకేష్ పాదయాత్రకు భారీ స్థాయిలో జనం మద్ధతు వచ్చింది. సభకు భారీగా జనం వచ్చారు.
ఇక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి టార్గెట్ గా లోకేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. 2019 ఎన్నికల్లో తాను గెలిస్తే జమ్మలమడుగు జాతకం మారుస్తానని సుధీర్రెడ్డి చెప్పారని, జమ్మలమడుగు జాతకం మారలేదు…కానీ సుధీర్రెడ్డి జాతకం మారిందని అన్నారు. సుధీర్రెడ్డి ఉదయం రెండు సూట్కేసులతో బయటికి వెళతాడని, ఒకటి ఖాళీ, రెండోది బీర్ కేసు. సాయంత్రం వచ్చేసరికి బీరు కేసు ఖాళీ అవుతుందని, సూట్కేసు ఫుల్ అవుతుందని ఆరోపించారు. ఇసుక దోపిడీ, గ్రావెల్ దోపిడీ, పరిశ్రమల నుంచి నెలనెలా కమీషన్లు, వెంచర్లు వేసే వారి వద్ద కమీషన్లు తీసుకుంటున్నారు. ఉద్యోగస్తుల ట్రాన్సఫర్లలో కమీషన్లు, ఆఖరికి చికెన్, మటన్ షాపులు మినరల్ వాటర్ వారి వద్ద కూడా కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపణలు చేశారు.
ఈ అంశాలు వైసీపీకి మైనస్ అవుతాయి గాని..కాకపోతే అక్కడ వైసీపీ స్ట్రాంగ్ బేస్ ఉంది. అంత ఈజీగా ఆ పార్టీని ఓడించడం కష్టమనే చెప్పాలి. ఇంకా టిడిపి కష్టపడాల్సి ఉంటుంది.