టీడీపీ యువ నేత నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్రలో నడుస్తూ నందమూరి తారకరత్న సొమ్మసిల్లిపడిపోయిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన్ను హుఠాహుఠిన సమీపంలోని కేసీ ఆస్పత్రికి తరలించగా వైద్యులు గుండెపోటుగా నిర్ధారించారు. దాంతో అక్కడి నుంచి పీఈఎస్ హాస్పటల్కు తీసుకెళ్లి చికిత్స అందించారు.
అయితే మెరుగైన వైద్యం కోసం బెంగళూరు నారాయణ హృదయాలయకు తరలించారు. శుక్రవారం అర్ధరాత్రి ప్రత్యేక అంబులెన్స్లో తారకరత్నను బెంగళూరుకు తీసుకెళ్లారు. అయితే తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని తాజాగా నారాయణ హృదయాలయ వైద్యులు హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. తారకరత్న హెల్త్ కండీషన్ ఇంకా క్రిటికల్గానే ఉందని.. ఆయనకు ఎక్మోపై చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు.
ప్రస్తుతం ఆయనను నిపుణుల బృందం పర్వవేక్షిస్తున్నారని బులెటిన్లో పేర్కొన్నారు వైద్యులు. మరికొన్ని రోజులు చికిత్స అందించాలని తెలిపారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితిని పది మంది వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని తెలిపారు డాక్టర్స్. ఈ లేటెస్ట్ హెల్త్ బులెటిన్ తో ఫ్యాన్స్ కలవర పాటుకు గురవుతున్నారు. తారకరత్న త్వరగా కోలుకోవాలంటూ ఆకాక్షిస్తున్నారు.