ప్రజల్లోకి వెళ్లాలి.. పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఒక చక్కటి అవకాశాన్ని చేజార్చుకున్నారనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. అదేంటి? అంటున్నారా? శనివారం విశాఖ విమానాశ్రయం వద్ద చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో జనసేన నాయకులను 78మందిని అరెస్టు చేయడం.. వీరిలో 9 మందిని జైలుకు పంపించడం.. మిగిలివారిని విడిచి పెట్టడం తెలిసిందే. అయితే.. ఈ మొత్తం ఎపిసోడ్లో.. పవన్.. వ్యవహరించిన తీరు కొంత వరకు బాగానే ఉందని.. తర్వాత.. పట్టుకోల్పోయారని అంటున్నారు పరిశీలకులు.
“ఒక మంచి అవకాశం వచ్చింది. పార్టీ తరఫున ప్రజల్లో ఒక చర్చను రేకెత్తించే అవకాశం దక్కింది. అయితే.. దానిని పవన్ చేజేతులా వదులుకున్నారు“ అని.. విశాఖ పట్నానికే చెందిన పలువురు నాయకులు పేర్కొన్నారు. ఎందుకంటే.. శనివారం సాయంత్రం చోటు చేసుకున్న పరిణామాలతో ఆదివారం వరకు పవన్ వ్యవహరించిన తీరు.. జనసేన పార్టీపై సాధారణ ప్రజల్లోనూ చర్చను లేవనెత్తింది. ప్రబుత్వంతో పోరాటమే అన్నట్టుగా.. ఆయన చేసిన వ్యాఖ్యలు.. పదే పదే.. ఆసక్తగా మారాయి. అదేసమయంలో హోటల్ గదిలో నుంచే.. అద్దాల వెనుక నుంచి అభివాదం చేయడం.. వరుస ట్వీట్లు చేసి.. సర్కారును ఇరుకున పెట్టడం కూడా.. ఆయనకు ప్లస్ అయింది.
ఇక, ఈ ఉద్యమం తీవ్రతరం అవుతుందని.. జనసేన నాయకులు భావించారు. దానికి తగిన విధంగా పవన్ కనుక ఉద్యమానికి దిగితే.. తాము కూడా.. రెడీ కావాలని భావించారు. మరి ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కూడా ఇలానే బెట్టును కొనసాగించారు. కానీ.. ఇంతలోనే పవన్ మారిపోయా రు. గవర్నర్ను కలిసేందుకు అంటూ.. ఆయన విశాఖ నుంచి విజయవాడకు వచ్చేశారు. దీంతో జనసేనలో అప్పటి వరకు ఉన్న ఊపు కాస్తా.. నీళ్లు జల్లినట్టు.. చల్లారిపోయింది. పైగా.. తనకు.. శాంతి యుత పంథానే కావాలని ప్రకటించడం కూడా పార్టీలో యువ నేతలకు రుచించడం లేదు
ఒక చెంపపై కొడితే.. రెండొ చూపించడానికి మనం గాంధీల కాలంలో లేమని..జనసేన నాయకులు చెబుతున్నారు. పార్టీ పుంజుకోవాలంటే.. కొన్ని రకాల ఎత్తుగడలు అవసరమని.. ఈ క్రమంలో పక్కా వ్యూహాలతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుందని అంటున్నారు. విశాఖలోనే పవన్ మరో రెండు లు ఉండి నేతలతో సమావేశం ఏర్పాటు చేసి.. పార్టీకి సరైన దశదిశ చూపిస్తారని అనుకున్నారు. కానీ, పవన్ అలాంటి ఆలోచన లేకుండానే విజయవాడ చేరుకున్నారని అంటున్నారు.