అబ్బా నంద్యాల ఉప ఎన్నిక ఏపీలో ఎలాంటి హీట్ను పుట్టించిందో చూశాం. ఈ హీట్ ఏకంగా నెల రోజుల పాటు అధికార టీడీపీ విపక్ష వైసీపీ నాయకుల మధ్య మాటల తూటాలు పేల్చింది. ఉప ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు అదిరిపోయాయాయి. ఈ ఎపిసోడ్ మొత్తం ట్విస్టులతో అదిరిపోయింది. టీడీపీలో ఉన్న శిల్పా మోహన్రెడ్డి వైసీపీలోకి వచ్చి క్యాండెట్ అవ్వడం, ఆ తర్వాత టీడీపీలోనే ఉన్న ఆయన సోదరుడు చక్రపాణిరెడ్డి కూడా వైసీపీలోకి వెళ్లి తన ఎమ్మెల్సీ పదవి వదులుకోవడం చకచకా జరిగిపోయాయి.
ఇక ఈ ఉప ఎన్నిక వేళ చాలా మంది నాయకులు టీడీపీ నుంచి వైసీపీలోకి, వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసేశారు. చివరకు ఈ ఎన్నిక చంద్రబాబు వర్సెస్ జగన్ మధ్య పోరుగా కూడా మారిపోయింది. ఫైనల్గా ఫలితం వచ్చేసరికి టీడీపీ 27 వేల ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించి శిల్పా మోహన్రెడ్డి చిత్తు చిత్తుగా ఓడిపోయారు. ఇప్పటికే శిల్పా సోదరులు చేతిలో ఆరేళ్ల పాటు ఉన్న ఎమ్మెల్సీ పదవి పోగొట్టుకోవడంతో పాటు మరో పదవికి పోటీ పడి చిత్తుగా ఓడిపోయారు.
పరువుతో పాటు ఫైనాన్షియల్గా కూడా వీరు లాస్ అయ్యారు. ఈ వరుస షాకులతో ఉన్న శిల్పా సోదరులకు మరో షాక్ ఇచ్చేందుకు టీడీపీ రెడీ అవుతోంది. ప్రస్తుతం వైసీపీలో ఉన్న నంద్యాల మునిసిపల్ చైర్పర్సన్ దేశం సులోచనను దింపేసి ఆ స్థానంలో టీడీపీకి చెందిన అభ్యర్థిని ఆ సీటులో కూర్చోపెట్టాలని టీడీపీ స్కెచ్ గీసింది. ఇందుకు సంబంధించి ముహూర్తం కూడా రెడీ అయినట్టు తెలుస్తోంది.
ప్రస్తుత నంద్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ దేశం సులోచన శిల్పా మోహన్ రెడ్డి మనిషి. ఆమె శిల్పా వెంట టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చారు. శిల్పాతో పాటు కొందరు కౌన్సెలర్లు కూడా వైసీపీలో చేరినా తర్వాత వారు తిరిగి టీడీపీ గూటికి వచ్చేశారు. ప్రస్తుతం నంద్యాల మునిసిపాలిటీలో టీడీపీకే మెజార్టీ సభ్యులు ఉన్నారని భావిస్తోన్న టీడీపీ అధిష్టానం సులోచనను దింపేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న శిల్పా వైసీపీ కౌన్సెల్లను కాపాడుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ఏదేమైనా మరోసారి నంద్యాల రాజకీయం హీటెక్కనుంది.