నియోజకవర్గాల పునర్విభజన చకచకా జరుగుతోందని వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ నుంచి ఈ ప్రక్రియ వేగం కానుందని కేంద్రం నుంచి వస్తోన్న వార్తలతో తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకుల్లో ఎక్కడా లేని ఉత్సాహం నెలకొంది. ఇదిలా ఉంటే ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన మీద అధికార టీడీపీ నాయకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో టీడీపీ బలంగా ఉన్న జిల్లాల్లో పశ్చిమగోదావరి జిల్లా ఒకటి. ఈ జిల్లా నుంచి నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు పలువురు టీడీపీ యువ నాయకులు పోటీ పడుతున్నారు.
ప్రస్తుతం జడ్పీ చైర్మన్గా ఉన్న ముళ్లపూడి బాపిరాజు, మాజీ కేంద్ర మంత్రి బోళ్ల బుల్లి రామయ్య మనవడు బోళ్ల రాజీవ్, ఎంపీ మాగంటి బాబు తనయుడు మాగంటి రాంజీ, చాగల్లు జడ్పీటీసీ అల్లూరి విక్రమాదిత్య తదితరులు ప్రధానంగా యూత్ కోటాలో రేసులో ఉన్నారు. వీరిలో ముళ్లపూడి బాపిరాజు అసెంబ్లీకి పోటీ చేసేందుకు ఇప్పటికే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసేశాడు.
ముళ్లపూడి పునర్విభజన జరిగితే నల్లజర్ల లేదా ద్వారకాతిరుమల కేంద్రంగా ఏర్పడే కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇక తాడేపల్లిగూడెం కూడా బాపిరాజుకు ఆప్షన్గా ఉంది. ఇక నియోజకవర్గాల పునర్విభజనలో కేంద్రం ఓ ట్విస్ట్ కూడా ఇచ్చింది. జిల్లాల యూనిట్గా కాకుండా ప్రస్తుతం ఉన్న లోక్సభ నియోజకవర్గాల ఆధారంగానే పునర్విభజన చేయాలని నిర్ణయం తీసుకోవడంతో కాస్త చిక్కులు తప్పేలా లేవు. ఈ పునర్విభజన ప్రకారం ప్రస్తుతం ఒక్కో లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న 7 ఎంపీ స్థానాలు 9 కానున్నాయి.
ఈ లెక్కన చూస్తే పశ్చిమగోదావరిలోని నరసాపురం లోక్సభ నియోజకవర్గం పరిధిలో 2 కొత్త స్థానాలు (పెనుగొండ, అత్తిలి, భీమవరం రూరల్లో రెండు), ఏలూరు లోక్సభ పరిధిలో 2 కొత్త స్థానాలు (జంగారెడ్డిగూడెం, ఏలూరు రూరల్), రాజమండ్రి లోక్సభ పరిధిలో 1 స్థానం ( ద్వారకాతిరుమల లేదా నల్లజర్ల) రానున్నాయి.
ఈ క్రమంలోనే జడ్పీ చైర్మన్గా ఉన్న బాపిరాజు దృష్టి కొత్తగా ఏర్పడే నల్లజర్ల లేదా ద్వారకాతిరుమలపైనే ప్రధానంగా ఉంది. ఆయన ఇక్కడ పోటీ చేసే దిశగా పావులు కూడా కదుపుతున్నారు. జడ్పీ చైర్మన్గా జిల్లా అంతా గ్రిప్ సాధించడం బాపిరాజుకు ఉన్న ప్లస్ పాయింట్. ఇక చాగల్లు జడ్పీటీసీగా ఉన్న అల్లూరి విక్రమాదిత్య కొవ్వూరు లేదా గోపాలపురంలో ఏ ఒక్క సీటు జనరల్ అయినా అక్కడ పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నాడు. విక్రమాదిత్యకు బలమైన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండడంతో పాటు లోకేశ్ అండదండలు కూడా ఉన్నాయి.
ఇక మాజీ కేంద్ర మంత్రి బోళ్ల బుల్లి రామయ్య మనవడు అయిన బోళ్ల రాజీవ్ గత ఎన్నికల్లోనే ఏలూరు ఎంపీ సీటు అడిగారు. వచ్చే ఎన్నికల కోసం ఏలూరు కేంద్రంగా రాజకీయాలకు ఆయన తెరలేపే ప్రయత్నాలు చేస్తున్నారు. రాజీవ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తాడనేది ఇప్పటకీ అయితే క్లారిటీ లేదు. అయితే రాజీవ్ ఏలూరు ఎంపీ సీటు లేదంటే అసెంబ్లీకి అయినా బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. బోళ్ల రాజీవ్ లోకేశ్కు సమీప బంధువు కావడంతో లోకేశ్ ద్వారా సీటు కోసం పావులు కదపుతున్నారు.
ఇక ఏలూరు ఎంపీ మాగంటి బాబు తనయుడు రాంజీ జిల్లా తెలుగు యువత పగ్గాలు చేపట్టారు. ఇప్పుడిప్పుడే ఆయన జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. రాంజీకి అసెంబ్లీ సీటు బాబు ఎంపీ సీటుకు లింక్ పెట్టి ఇస్తారని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. రాంజీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటే దెందులూరు లేదా ఏలూరు రూరల్ రెండు ఆప్షన్లు ఉన్నాయి. విప్ ప్రభాకర్ ఈ రెండిట్లో ఒక చోట నుంచి రాంజీ యరో సీటు నుంచి పోటీ చేసే ఛాన్సులు ఉన్నాయి.