యూపీ అధికార పార్టీ ఎస్పీ అధినేత ములాయం సింగ్ ప్రధాని కావాలనే ముచ్చట ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. అంతేకాదు, వచ్చే 2017 రాష్ట్ర ఎన్నికల్లో తిరిగి ఎస్పీని అధికారంలోకి తీసుకురావాలన్న ఆయన ఆశలపై నా నీళ్లు జల్లుతున్న పరిస్థితే కనిపిస్తోంది. ఈ రెండు విషయాల్లోనూ ఆయన క్లారిటీగానే ఉన్నా.. ఆయన భాగస్వామ్య పార్టీలు మాత్రం ములాయం కాళ్లకు బంధాలేస్తున్నాయి. దీంతో నేతాజీ చిక్కుల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నారు. వాస్తవానికి ఎస్పీ విషయంలో ములాయం మాటే వేదం! అయితే, మారిన పొలిటికల్ సీన్ నేపథ్యంలో తమ మాటకు కూడా విలువ ఇవ్వాలని కొన్ని భాగస్వామ్య పార్టీలు కోరుతున్నాయి. సో.. ఇది ములాయంను ఇరకాటంలోకి నెట్టేస్తోంది. విషయంలో వెళ్తే..
2017 ఆరంభంలోనే యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే అధికార ఎస్పీలో ఆధిపత్య పోరు పెరిగింది. సీఎం అఖిలేష్, ఆయన బాబాయి. గనుల మంత్రి శివపాల్ యాదవ్ మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి వచ్చింది. ఈక్రమంలో ఆయా ఘర్షణనలు నేతాజీ పరిష్కరించినా.. ఈ వార్లో ఆయన తన కొడుకు కంటే తమ్ముడు శివపాల్, మిత్రుడు అమర్ సింగ్వైపే మొగ్గు చూపారు. అయితే, ప్రజల్లో ఓ వర్గం మాత్రం ఎస్పీ అధినేత ములాయం కన్నా యువ సీఎం అఖిలేష్ పాలన బాగుందని భావిస్తున్నట్టు వార్తలు ఊపందుకున్నాయి. అయితే, ఎస్పీ అంతర్గత గొడవల నేపథ్యంలో సీఎం అభ్యర్థిని ఎన్నికలకు ముందు ప్రకటించే ఛాన్స్ లేదని ములాయం స్పష్టం చేశారు.
అంతేకాదు, ఎన్నికల అనంతరమే.. సీఎం అభ్యర్థి ఎంపిక ఉంటుందన్నారు. ఇదిలాంవుంటే, 2017 ఎన్నికల్లో యూపీపై కన్నేసిన బీజేపీ భారీ ఎత్తున ప్రచారం నిర్వహించడంతో పాటు .. అధికారాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఇక, బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా పెద్ద ఎత్తున సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఎస్పీ అధినేత ములాయం కాంగ్రెస్తో జట్టుకట్టి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారట. కానీ, ఇక్కడే ఆయనకు ఓ ఎదురు దెబ్బ తగులుతోందట. సీఎం అభ్యర్థి విషయంలో క్లారిటీ ఇవ్వాలని, ముఖ్యంగా సీఎం అభ్యర్థిగా తిరిగి అఖిలేష్నే నిలబెడతామని ప్రకటించాలని ములాయంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ ఒత్తిడి తెస్తున్నారట.