మాజీ ఐపీఎస్ అధికారి, ఇప్పుడు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తున్న కిరణ్ బేడి, సినీ నటుడు రజనీకాంత్ని తమ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించాలని విజ్ఞప్తి చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ‘ప్రోస్పరస్ పుదుచ్చేరి’ అనే మిషన్తో పుదుచ్చేరి అభివృద్ధికి శ్రీకారం చుట్టిన కిరణ్ బేడి, రజనీకాంత్ని ఇందు కోసం బ్రాండ్ అంబాసిడర్గా ఉండమని ట్విట్టర్ ద్వారా కోరారు. తన విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందిస్తారని కూడా ఆమె ఆశిస్తున్నారు. అయితే రజనీకాంత్కి రాజకీయాల పట్ల అంత ఆసక్తి లేదు. భారతీయ జనతా పార్టీతో ఆయనకు కొంత స్నేహం ఉన్నా, దాన్ని కేవలం నరేంద్రమోడీతో స్నేహం వరకు పరిమితం చేశారు.
గత ఎన్నికల్లో రజనీకాంత్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు, బిజెపి ఆహ్వానించినప్పటికీ. అయితే అవినీతి వ్యతిరేక ఉద్యమంలో కిరణ్ బేడికి సంపూర్ణ సహకారం అందించారు రజనీకాంత్. అన్నా హజారే టీమ్లో పనిచేశారామె అప్పట్లో. అయితే కిరణ్ బేడి ప్రస్తుతం బిజెపి నాయకురాలు. బిజెపి నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. బిజెపి కోసం ఆమె పని చేయడంతో గవర్నర్గా అవకాశం కల్పించారు నరేంద్రమోడీ. కిరణ్ బేడి ఒకప్పుడు కేజ్రీవాల్తో కలిసి అన్నా హజారే టీమ్లో ఉండేవారు. అలా కిరణ్ బేడీకే కాకుండా అరవింద్ కేజ్రివాల్కి కూడా రజనీకాంత్ స్నేహితుడే. ఏదేమైనా పుదుచ్చేరి అభివృద్ధి కోసం కిరణ్ బేడీ చేస్తున్న కృషి ప్రశంసనీయం.
ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే కిరణ్ బేడీ రజినీతో పాటు ఇళయదళపతి విజయ్ ని కూడా ఆహ్వానించింది.దీనిపై విజయ్ ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.విజయ్ ఈ మధ్యనే భారతన్ తీస్తున్న సినిమా షూటింగ్ షెడ్యూల్ పూర్తయి హాలిడేలో వున్నారు.మొత్తానికి ఈ ఇద్దరు తమిళ్ సూపర్ స్టార్లు కిరణ్ బేడీ విషయంలో ఎలా స్పందిస్తారో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.