కృష్ణా జిల్లాలోని గన్నవరం రాజకీయాలు వాడివేడిగా సాగుతున్న విషయం తెలిసిందే. అనూహ్యంగా టిడిపి నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్ళిన వల్లభనేని వంశీ..చంద్రబాబు, లోకేష్ టార్గెట్ గా ఎలా తిడుతున్నారో తెలిసిందే. అటు టిడిపి నేతలు సైతం వంశీకి కౌంటర్లు ఇస్తున్నారు. ఇదే సమయంలో తాజాగా గన్నవరంకు చెందిన స్థానిక టిడిపి నేత..వంశీని విమర్శించారని చెప్పి..వంశీ అనుచరులు..టిడిపి నేత ఇంటిపై దాడి చేసిన విషయం తెలిసిందే.
ఈ దాడికి సంబంధించి వంశీ అనుచరులపై కేసు నమోదు చేయడానికి వెళ్ళిన టిడిపి నేత పట్టాభి, టిడిపి శ్రేణులపైనే రివర్స్ లో కేసులు పెట్టారు. ఇదే సమయంలో గన్నవరం టిడిపి ఆఫీసుపై వంశీ అనుచరులు దాడి చేశారు. దీంతో టిడిపి శ్రేణులు జాతీయ రహదారిపై ఆందోళన చేశారు. ఈ క్రమంలో వైసీపీ శ్రేణులు అక్కడకు రావడంతో రెండు వర్గాల మధ్య రచ్చ జరిగింది. దీంతో పట్టాభిని, ఇతర టిడిపి నేతలని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇక పట్టాభిని అరెస్ట్ చేసి ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని తాజాగా మీడియాకి చూపించారు. ఇలా పట్టాభిని, టిడిపి నేతలని అరెస్ట్ చేయడంపై జిల్లా నేతలు, చంద్రబాబు ఫైర్ అయ్యారు. చంద్రబాబు..పట్టాభి ఇంటికెళ్ళి కుటుంబ సభ్యులని పరామర్శించారు. అయితే ఇలా గన్నవరం రగడ కొనసాగుతుంది. ఇదే సమయంలో గన్నవరం ఇంచార్జ్ గా ఉన్న బచ్చుల అర్జునుడు అనారోగ్యంతో హాస్పిటల్ లో ఉన్నారు.
ఈ నేపథ్యంలో గన్నవరంకు బలమైన నేతని పంపాలని టిడిపి శ్రేణులు కోరుతున్నాయి. అప్పుడే వంశీకి గట్టిగా కౌంటర్ ఇవ్వగలమని, నాయకత్వలేమి వల టిడిపి ఇబ్బందులు పడుతుందని త్వరగా బలమైన నాయకుడుని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే దేవినేని చందు అధిష్టానం అవకాశం ఇస్తే గన్నవరంలో పోటీ చేస్తానని అంటున్నారు. అటు గద్దె ఫ్యామిలీ నుంచి అనురాధా ఉన్నారు. వీరిలో ఎవరోకరిని గన్నవరంలో పెట్టాలని కోరుతున్నారు. చూడాలి మరి చంద్రబాబు..గన్నవరంకు కొత్త నేతని పంపుతారో లేదో.