రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా.. బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం లైగర్. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. కానీ అంచనాలకు తగ్గట్టుగా సినిమా విడుదలైనా.. అభిమానుల అంచనాలను కూడా ఈ సినిమా అందుకోలేకపోయింది. దీంతో భారీ డిజాస్టర్ గా మిగిలింది ఈ సినిమా. ఈ నేపథ్యంలోనే దర్శకనిర్మాత పూరీకి మరియు బయ్యర్లకు మధ్య వివాదం నెలకొంది. అయితే ఇప్పుడు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని డిస్ట్రిబ్యూటర్స్ పై పూరి పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
అసలు విషయంలోకి వెళ్తే.. లైగర్ సినిమాకు గాను నష్టపరిహారం కోరుతూ పూరీ జగన్నాథ్ ఇంటిముందు ధర్నాకు దిగుతామని ఎగ్జిక్యూటివ్స్ హెచ్చరిస్తున్న ఓ సందేశం సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఇందులో పూరీ మాట్లాడిన ఒక వీడియో బయటకు రావడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో బుధవారం రాత్రి డిస్ట్రిబ్యూటర్స్ పై జూబ్లీహిల్స్ లోని పోలీస్ స్టేషన్లో పూరీ జగన్నాథ్ ఫిర్యాదు చేశారు. డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను మరియు ఫైనాన్షియర్ శోభన్ బాబులు తన కుటుంబం పై దాడి చేయడానికి ఇతరులను హింసకు ప్రేరేపిస్తున్నారని పూరీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.. ప్రస్తుతం తాను ముంబైలో ఉన్నానని.. నేను లేనప్పుడు నా కుటుంబాన్ని మానసికంగా, శారీరకంగా హింసించి.. అక్రమంగా డబ్బులు వసూలు చేయాలని చూస్తున్నారని కూడా ఆ ఫిర్యాదులో తెలిపారు.
అంతేకాదు వరంగల్ శ్రీను, శోభన్ బాబులు ఒకరికొకరు కుమ్మక్కయి వాట్సాప్ ద్వారా నాపై సబ్ డిస్ట్రిబ్యూటర్లను రెచ్చగొట్టారని మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇది నా నుండి చట్ట విరుద్ధంగా డబ్బు సేకరించేందుకు బ్లాక్ మెయిలింగ్ మరియు వేధింపులకు సంబంధించి స్పష్టమైన కేసు అని తెలిపారు పూరీ జగన్నాథ్. అంతేకాదు వరంగల్ శ్రీను శోభన్ బాబు పై కఠిన చర్యలు తీసుకోవాలని తాను అభ్యర్థిస్తున్నట్లు.. తన కుటుంబానికి, తనకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుతున్నట్లు కూడా పూరి జగన్నాథ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తానికైతే లైగర్ సినిమాను డైరెక్ట్ చేసి నిర్మాతగా వ్యవహరించిన పూరి జగన్నాథ్ ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ల విషయంలో ఇరుకున పడ్డట్టు అయ్యింది. మరి ఈ విషయం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.