కన్నడ పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్నారు హీరో పునీత్ రాజ్కుమార్! మొన్నటి వరకు పునీత్ రాజ్కుమార్ అంటే ఒక స్టార్ హీరోగా మాత్రమే అందరికి పరిచయం. కానీ ఆయన మరణంతో ఆయన ఒక నిజమైన హీరో అని దేశమంతా తెలిసింది. చేసే పనిలో మంచి ఉండాలి, అలాగే మనం చేసే ప్రతి మంచి పని అందరికి తెలియాల్సిన పని లేదు అనే సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తి పునీత్ రాజ్ కుమార్. ఆయన బతికి ఉండగా ఆయన చేసిన మంచి పనులు గురించి ఎవరికీ తెలియలేదు. కానీ ఆయన మరణం అనంతరం పునీత్ చేసిన మంచి పనుల గురించి ప్రపంచం అంతా తెలిసింది.
ఆయన అకాల మరణం వార్త విని ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. కన్నడ ప్రజల గుండెల్లో ఆయన స్థానం ఎప్పటికి అలానే ఉంటుంది. సెలబ్రిటీలు సైతం పునీత్ను తలచుకుని కన్నీళ్లు పెట్టుకున్నారంటే ఆయన మంచితనం ఏంటో తెలుస్తుంది. ఇక పునీత్ అంతక్రియలు ముగిశాక వారి సంప్రదాయం ప్రకారం కుటుంబ సభ్యులు పూజలు చేయాల్సి ఉంటుంది. వారి సంప్రదాయం ప్రకారం పునీత్ రాజ్కుమార్ సమాధికి ఆయన కుటుంబ సభ్యులు నిన్నటి నుంచి ఐదు రోజుల పాటు పాలశాస్త్ర పూజలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే నిన్న ఉదయం 11 గంటలకు కంఠీరవ స్టూడియోలో గల పునీత్ సమాధి వద్దకు కుటుంబ సభ్యులు చేరుకుని ఆయనకు ఎంతో ఇష్టమైన ఇడ్లి, రాగిముద్ద, నాటుకోడి, సాంబారుతో పాటు మరో 50 రకాల సాంప్రదాయ వంటకాలను వండించి పునీత్ సమాధిపై పెట్టి పూజలు నిర్వహించారు.ఈ పూజల్లో ఆయన భార్య అశ్విని, కూతుర్లు ధృతి, వందితా.. అన్నలు శివరాజ్కుమార్, రాఘవేంద్ర రాజ్కుమార్.. ఇతర కుటుంబ సభ్యులు, పలువురు రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. మరో నాలుగు రోజుల పాటు ఇలాగే పూజలు జరుగుతాయని తెలుస్తుంది. పునీత్ ఆత్మకు శాంతి జరగాలని అందరు ఆయన సమాధి వద్ద ప్రార్ధనలు నిర్వహించారు. !