నంద్యాల ఉపఎన్నిక కౌంటింగ్లో టీడీపీ హవా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 9 రౌండ్ల కౌంటింగ్ అవ్వగా 9 రౌండ్లలోను టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికే మెజార్టీ లభించింది. 9 రౌండ్లు ముగిసే సరికి టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి 18,132 ఓట్ల మెజార్టీతో దూసుకుపోతున్నారు. వైసీపీ శ్రేణులు నిరాశలో మునిగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఇక 9 రౌండ్లలోను టీడీపీకే మెజార్టీ వచ్చినా పట్టణంలో టీడీపీకి ముందునుంచి భారీ మెజార్టీ వస్తుందని అందరూ లెక్కలు వేశారు. అయితే 8, 9 రౌండ్లలో మాత్రం టీడీపీకి మెజార్టీ తగ్గింది. 8వ రౌండ్లో కేవలం 348 ఓట్ల మెజార్టీ వస్తే, 9 వ రౌండ్లో
879 ఓట్ల మెజార్టీ వచ్చింది.
ఈ రెండు రౌండ్లు నంద్యాల పట్టణంలోనే ఉన్నా టీడీపీకి మాత్రం మెజార్టీ తగ్గడానికి ఓ ప్రత్యేక కారణం కనిపిస్తోంది. ఈ ప్రాంతాలు వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్రెడ్డి ఇంటి సమీపంలోనే ఉన్నాయి. దీంతో ఆయన ఇంటి పక్కల ఉన్న వార్డుల్లో కూడా ఆయనకు మెజార్టీ రాకపోయినా టీడీపీ మెజార్టీ మాత్రం కాస్త తగ్గించ గలిగారు. శిల్పాకు ఇప్పటి వరకు ఇదే కాస్త ఉపశమనం.