కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ తెలంగాణ సీఎం కుమారుడు, మంత్రి కేటీఆర్ కేంద్రంగా మరోసారి రెచ్చిపోయారు. మొన్నామధ్య కూడా కేటీఆర్ కేంద్రంగా అనేక ఆరోపణలు చేసిన ఆయన ఇప్పుడు మరింతగా తీవ్రమైన విమర్శలు చేయడం మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. దేశాన్ని కుదిపేసిన తెలంగాణ డ్రగ్స్ వ్యవహారంలో సాక్షాత్తూ సీఎం కుమారుడు , మంత్రి కేటీఆర్కు(టీఆర్ ఎస్ వారసుడు అని దిగ్విజయ్ పేర్కొనడం గమనార్హం) అత్యంత సన్నిహితులు ఉన్నారని డిగ్గీరాజా పేర్కొన్నారు. అంతేకాదు, ప్రస్తుతం సాగుతున్న విచారణలో కేటీఆర్ సన్నిహితులు ఉన్నారని, వీరిని విచారిస్తోరో? లేక రక్షిస్తారో? చూడాలని హాట్ హాట్ వ్యాఖ్యలతో ట్వీట్ చేశారు.
ఈ పరిణామం తెలంగాణలో సంచలనం సృష్టించింది. ముఖ్యంగా కేటీఆర్ను ఉద్దేశించి గతంలోనూ పోలీసులు ముస్లిం యువకులే లక్ష్యంగా నకిలీ ఉగ్ర వాదుల నెట్ అకౌంట్లు నడుపుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని డిగ్గీరాజా రెచ్చిపోయారు. దీనిపై తీవ్ర సంచలనం రేగడంతో ఎట్టకేలకు కేటీఆర్ స్పందించక తప్పలేదు. ఇక, ఇప్పుడు కూడా కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. రిటైర్ అవ్వాల్సిన వయసులో… వయసుకు తగినట్లుగా నడుచుకోండి అంటూ ఘాటుగానే రిప్లై ఇచ్చారు.
నేటి ఉదయం 8.42 గంటలకు డిగ్గీరాజా ట్విట్టర్ లో ఎంట్రీ ఇవ్వగా ఓ గంటలోనే స్పందించిన కేటీఆర్ సరిగ్గా 10 గంటలకు తన రెస్పాన్స్ ను అదే ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. డిగ్గీరాజా ట్వీట్ – కేటీఆర్ రీట్వీట్ తో ఇప్పుడు డ్రగ్స్ వ్యవహారానికి రాజకీయ రంగు అంటుకుంది. దీంతో ఈ పరిణామం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి. డిగ్గీరాజా ఇచ్చిన క్లూతో స్థానిక కాంగ్రెస్ నేతలు తమ దూకుడు పెంచితే అధికార టీఆర్ ఎస్కి ఇబ్బందులు తప్పేలా లేవు. మరి వీరు ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారో చూడాలి. ఏదేమైనా ఇప్పుడు డిగ్గీరాజా ట్వీట్ డ్రగ్స్ కేసును మరో సరికొత్త మలుపు తిప్పుతుందనడంలో సందేహం లేదు.