తెలంగాణ సీఎం కేసీఆర్ కేబినెట్లో డిప్యూటీ సీఎం పదవి ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. ఈ పదవి అంతగా అచ్చిరాదని అంటున్నారు నేతలు! నిజానికి డిప్యూటీ సీఎం అంటే.. సీఎం తర్వాత సీఎం అంతటి లెవల్. అయితే, తెలంగాణలో మాత్రం కాదట. అంతా తానే అని వ్యవహరించే కేసీఆర్.. మాత్రం.. డిప్యూటీ సీఎంను పూచిక పుల్లగా తీసిపారేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం రాష్ట్రంలో మియాపూర్ భూ కుంభకోణం సంచలనంగా మారింది.
ల్యాండ్ స్కామ్.. లో ఇప్పటికే కేకే వంటి పెద్దల పేర్లు బయటపడ్డాయి. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి పోలీసుల అదుపులోనే ఉన్నాడు. ఇక, ఇప్పుడు ఈ కేసు అటు తిరిగీ, ఇటు తిరిగీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మెడకు చుట్టుకుంది. రిజిస్ట్రేషన్ల శాఖ ప్రక్షాళనకు పూనుకున్న కేసీఆర్.. ఆ శాఖనే తానే నిర్వహించాలని యోచిస్తున్నారు. అందుకే మహమూద్ అలీ పోస్ట్ పీకేయాలని డిసైడయ్యారు. మైనార్టీల నుంచి నిరసనలు వచ్చినా తగ్గకూడదని గులాబీ బాస్ డిసైడైనట్లు టీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గతంలోనూ డిప్యూటీ సీఎంగా ఉన్న టీ రాజయ్యను ఒక్క కలం పోటుతో పీకిపారేశాడు కేసీఆర్. వైద్య శాఖలో అవినీతిని అడ్డుకోకపోగా రాజయ్యే అవినీతి పరుడుగా మారాడని కేసీఆర్ తెలుసుకుని ఆయన పదవిని నిర్దాక్ష్యణ్యంగా పీకేయించాడు. ఇక, ఇప్పుడు మహమూద్ అలీ పేరు కూడా వినిపిస్తోంది. నేడో రేపో ఈయనకు కూడా కేసీఆర్ ఉద్వాసన పలకడం ఖాయంగా కనిపిస్తోందట. మరి మైనారిటీ వర్గాలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి!!