నెల్లూరు జిల్లాలో రెడ్ల రాజకీయం వేరు. ఇక్కడ ఏ పార్టీ అయినా రెడ్డి కులస్తుల హవానే ఉంటుంది. అయితే గత టీడీపీ ఎన్నికల తర్వాత మాత్రమే ఫస్ట్ టైం ఇక్కడ రెడ్డి కులస్తులకు మంత్రివర్గం దక్కలేదు. కాపు వర్గానికి చెందిన నారాయణకు మంత్రి పదవి దక్కింది. తొలిసారి నెల్లూరులో రెడ్డి వర్గం నేతకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో నారాయణ మూడేళ్ల పాటు జిల్లాలో పట్టుకోసం ట్రై చేసినా పట్టు చిక్కలేదు. చివరకు ఇప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి మంత్రి పదవి రావడంతో జిల్లా టీడీపీ శ్రేణులు ఫుల్ ఉత్సాహంలో ఉన్నాయి.
ఇదిలా ఉంటే సోమిరెడ్డికి రైట్ హ్యాండ్గా ఈ పదేళ్లలో ఎంతో కీలకంగా వ్యవహరించిన ఓ వ్యక్తి వ్యవహారశైలీ ఇప్పుడు నెల్లూరు రెడ్లకు బాగా మంట పుట్టిస్తోంది. చివరకు ఆ వ్యక్తి ఓవరాక్షన్కు చెక్ పెట్టేందుకు డిసైడ్ అయిన వీరంతా ఈ విషయాన్ని సీఎం చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు మంత్రి లోకేశ్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు సమాచారం.
సోమిరెడ్డికి దశాబ్ద కాలంగా రైట్ హ్యాండ్గా ఉంటున్న డాక్టర్ జడ్.శివప్రసాద్ సోమిరెడ్డికి మంత్రి పదవి వచ్చే వరకు అందరితోను సఖ్యతతో ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున మేయర్ క్యాండెట్గా ఆయన పేరు పరిశీలనకు వచ్చింది. అయితే మేయర్ వైసీపీ గెలుచుకోవడంతో శివప్రసాద్ ఆశలు నెరవేరలేదు. ఇక సోమిరెడ్డి మంత్రి అయిన వెంటనే శివప్రసాద్ వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ సీటు తనదే అని చెప్పుకోవడం స్టార్ట్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ టీడీపీ టిక్కెట్టు సోమిరెడ్డి అండతో తనకే వస్తుందని ఆయన ప్రచారం చేసుకోవడంతో పాటు ఫ్లెక్సీలు వేయించుకోవడం జిల్లా టీడీపీలో రెడ్డి వర్గం నేతలతో పాటు మిగిలిన వారిలో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. వాస్తవానికి నెల్లూరు లోక్సభ నియోజకవర్గంతో పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్గా ఆదాల ప్రభాకర్రెడ్డి ఉన్నారు. శివప్రసాద్ ఓవర్యాక్షన్ ఆదాలతో పాటు ఆనం బ్రదర్స్, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రయాదవ్, ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డిలో కూడా తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.
ఇక తాజాగా ఆదాల ప్రభాకర్రెడ్డి సైతం శివప్రసాద్ తీరుపై సోమిరెడ్డి వద్ద తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో వీరంతా ఇదే విషయంపై తీవ్రస్థాయిలో మండిపడడంతో పాటు చంద్రబాబు, లోకేశ్ దృష్టికి తీసుకెళ్లడంతో పార్టీ అధిష్టానం శివప్రసాద్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేందుకు రెడీ అయ్యిందట.