తెలుగు సంవత్సరమైన ఉగాది సందర్భంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో పంచాగ శ్రవణం ఎప్పటి నుంచో వస్తోన్న అనవాయితి. ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు ఆయా పార్టీల కార్యాలయాల్లో కూడా పంచాగ శ్రవణం కంటిన్యూ అవుతుంది. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ తన కొత్త కార్యాలయమైన ప్రగతి భవన్లో పంచాగ శ్రవణం నిర్వహించారు.
ప్రగతి భవన్లో ప్రముఖ పంచాంగకర్త బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. ఈ పంచాగ శ్రవణంలో సీఎం కేసీఆర్తో పాటు టీఆర్ఎస్ ప్రభుత్వానికి తిరుగులేదని ఆయన చెప్పారు. ఇక ఈ యేడాది తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని సంతోష్ కుమార్ చెప్పారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్కు చెందిన ఓ నాయకుడికి ప్రమాదం పొంచి ఉందని ఆయన చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు అటు అధికార పార్టీలో కలకలం రేపుతున్నాయి.
ఇక ఇదే పంచాంగంపై కేసీఆర్ కూడా మాట్లాడుతూ ఈ యేడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని పంచాగం చెపుతుండడం ఆనందంగా ఉందన్నారు. శాస్త్రవేత్తలు కూడా మంచి వర్షాలు ఉంటాయని చెప్తున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. అధికారులు కూడా అద్భుతంగా పనిచేస్తున్నారని…తెలంగాణ దేశంలోనే అత్యధిక వృద్ధిరేటుతో దూసుకుపోతోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఇవన్నీ బాగానే ఉన్నా టీఆర్ఎస్లో ఓ నాయకుడికి ప్రమాదం ఉందని కేసీఆర్ చెప్పడమే పార్టీ నాయకుల్లో చాలామందికి ఆందోళన కలిగిస్తోంది. కొందరు సీనియర్లు అయితే తమ మంత్రి పదవి పోతుందేమోనని ఆందోళన చెందుతున్నట్టు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.