టిడిపి-జనసేన మధ్య అధికారికంగా పొత్తు ఫిక్స్ కాలేదు..కానీ అనధికారికంగా మాత్రం పొత్తు ఫిక్స్ అయినట్లే కనిపిస్తుంది. రెండు పార్టీలు ఒకే లైన్ లో వెళుతున్నాయి. చంద్రబాబు-పవన్ మంచి అండర్స్టాండింగ్తో ముందుకెళుతున్నారు. ఈ క్రమంలో పొత్తు దాదాపు ఫిక్స్ అయినట్లే తెలుస్తోంది. అందుకే అప్పుడే సీట్ల గురించి కూడా చర్చలు నడిచిపోతున్నాయి. ఇప్పటికే పలు సీట్ల కోసం అటు టిడిపి, ఇటు జనసేన నేతలు పట్టు పడుతున్నారు.
ఈ క్రమంలోనే కృష్ణా జిల్లాలో సీట్ల కోసం అప్పుడే పోటీ నెలకొంది. ఇప్పటికే అక్కడ ఒకే సీటులో పలువురు టిడిపి నేతలు పోటీ పడుతున్నారు. ఇక ఆ సీటులోనే జనసేన కూడా పోటీ పడుతుంది. కోటగా ఏర్పడిన కృష్ణా జిల్లాలో 7 సీట్లు ఉన్నాయి. గుడివాడ, గన్నవరం, పెనమలూరు, పామర్రు, అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో గన్నవరం తప్ప..అన్నీ సీట్లు వైసీపీ గెలుచుకుంది. తర్వాత గన్నవరం ఎమ్మెల్యే సైతం వైసీపీలోకి వెళ్లారు. దీంతో మొత్తం వైసీపీ చేతుల్లోనే ఉన్నాయి.
ఇక ఇప్పుడు కృష్ణాలో టిడిపి-జనసేనల మధ్య సీట్ల పంచాయితీ నడుస్తుంది. ఎలాగో గుడివాడ, గన్నవరం, పెనమలూరు, పామర్రు సీట్లలో జనసేనకు పెద్ద బలం లేదు. దీంతో ఆ సీట్లని జనసేన కోరుకోవడం లేదు. కానీ మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ సీట్లలో జనసేనకు బలం ఉంది. ఈ మూడు సీట్లపై జనసేన కన్నేసింది.
అయితే మచిలీపట్నంలో టిడిపి నుంచి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు. ఈయన టిడిపిలో బలమైన బిసి నాయకుడు. కాబట్టి ఈ సీటు జనసేనకు ఇచ్చే ఛాన్స్ లేదు. ఇక పెడన, అవనిగడ్డ సీట్లు మెయిన్. ఈ రెండు చోట్ల కూడా టిడిపికి బలమైన నాయకులు ఉన్నారు. అలాంటప్పుడు టిడిపి ఈ సీట్లని వదులుకుంటుందా? లేదా ఈ రెండిటిల్లో ఒక సీటు జనసేనకు ఇస్తుందా? అనేది చూడాలి. మరి జనసేన ఎన్ని సీట్లు అడుగుతుందో చూడాలి.