నిన్న తెలుగుదేశం యువ అధ్యక్షుడు నారా లోకేష్ పాద యాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న సొమ్మసిల్లిపడిపోవడం, కుప్పంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా వైద్యులు గుండెపోటుగా నిర్ధారించడం అందరికీ తెలిసిందే. తారకరత్న హార్ట్లో బ్లాక్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఆయనకు గుండెపోటు వచ్చిందని చికిత్సనందించిన వైద్యులు తెలిపారు.
మెరుగైన వైద్యం కోసం తారకరత్నను శుక్రవారం అర్ధ రాత్రి 12 గంటల సమయంలో బెంగళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారు. అక్కడ డాక్టర్ ఉదయ్ నేతృత్వంలో తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు. అయితే తారకరత్నను కుప్పం ఆసుపత్రికి తీసుకొచ్చినప్పుడు పల్స్ లేదని, శరీరం నీలంగా మారిందని, వెంటనే చికిత్స ప్రారంభించామని వైద్యులు పేర్కొన్నారు.
దీంతో తారకరత్న పై విషప్రయోగం జరిగిందని.. అందుకే అతడి శరీరం నీలం రంగులోకి మారిందని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ, ఇప్పుడో షాకింగ్ ట్విస్ట్ బయటకు వచ్చింది. తారకరత్న శరీరం నీలం రంగులోకి మారడం వెనక అపలైన కారణాన్ని వైద్యులు వెల్లడించారు. తారకరత్న శరీరంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉంది. శరీరంలో హిమోగ్లోబిన్ తక్కువై రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోతే ఈ సమస్య వస్తుంది. మనిషి శరీరంలో ఏ ఏ అవయవాలకు రక్తం అందకుండా ఉంటుందో ఆ అవయవాలు చివరన అంటే చేతివేళ్లు, కాలివేళ్లు చివరన నీలం రంగులోకి మారుతాయి. తారకరత్న విషయంలో కూడా అదే జరిగిందని వైద్యులు పేర్కొన్నారు.