ఏపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. మరో వైపు ఏపీలో తమ బలం చాలా పెరిగింది అని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఢంకా బజాయించి మరీ చెప్పుకుంటోంది. అయితే కొన్ని కీలక నగరాలు, పట్టణాల్లో మాత్రం టీడీపీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోన్న వాతావరణం అయితే ఉంది. ఉత్తరాంధ్రలో అధికారంలోకి వచ్చాక వైసీపీ తన పట్టును రోజు రోజుకు పెంచుకుంటోంది. ఇక కీలకమైన విశాఖ వంటి సిటీలో మాత్రం తమ్ముళ్లకు ఎందుకో సొంత పార్టీ మీద నమ్మకం కుదరడం లేదా ? అన్న సందేహాలే కలుగుతున్నాయి.
జీవీఎంసీ ఎన్నికల్లో తాము గెలుస్తామని టీడీపీ ఎంత ధీమాతో ఉన్నా కూడా ఇక్కడ అధికార వైసీపీ విజయం సాధించింది. ప్రత్యేకించి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విశాఖపై పూర్తిస్థాయిలో పట్టు సాధించేశారు. ఇక్కడ 60 మందికి పైగా కార్పోరేటర్లతో అధికార వైసీపీ చాలా సేఫ్ జోన్లో ఉంది. అయితే ఇక్కడ టీడీపీ కూడా ఎక్కువ మంది కార్పోరేటర్లను ( రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే) కాస్త బలంగానే ఉన్నట్టు ఉంది. అయినా కూడా ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్పోరేటర్లకు ఇక్కడ నమ్మకం కలుగుతున్నట్టుగా లేదు.
అందుకు ఇంకా ఎన్నికలకు రెండేళ్ల టైం ఉండగానే కొందరు ప్రజాప్రతినిధులు పక్కదారి చూస్తున్నారు. తాజాగా టీడీపీకి చెందిన ఓ సీనియర్ కార్పోరేటర్ టీడీపీ సైకిల్ దిగేసి ఫ్యాన్ నీడకు చేరడానికి చూస్తున్నారు అన్న వార్తలు అయితే నగర రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఉగాది ముహూర్తంగా ఆయన పార్టీ మారడానికి రెడీ అవుతున్నారట. ఆయన పార్టీ మారితే 87వ డివిజన్లో టీడీపీ మొత్తం స్మాష్ అయిపోతుంది.
ఆయన వైఖరి మీద ఇప్పటికే అపనమ్మకంతో ఉన్న నగర టీడీపీ షోకాజ్ నోటీసులు జారీ చేసినా కూడా ఆయన ఉలుకు పలుకు లేకుండా ఉన్నారట. పైగా బలమైన సామాజిక వర్గానికి చెందిన ఆయన పార్టీ మారితే విశాఖ టీడీపీలో పార్టీ కేడర్, నాయకులకు మరింత నమ్మకం సన్నగిల్లుతుంది.