కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అక్టోబర్ 29న గుండెపోటుతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. కన్నడ పరిశ్రమలో స్టార్ హీరోగా సత్తా చాటడమే కాదు.. ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజ సేవకుడిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారాయన. ఎన్నో అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలలకు సాయం చేయడమే కాకుండా, 1800 పిల్లలకు ఉచితంగా చదువు చెప్పిస్తున్నారు.
అయితే ఇప్పుడు పునీత్ లేరు. ఈ నేపథ్యంలోనే ఆ 1800 పిల్లల బాధ్యతా నాదేనంటూ ముందుకు వచ్చారు హీరో విశాల్. ఇప్పటి వరకు పునీత్ చదివించిన 1800 మంది చిన్నారుల బాధ్యతను ఇకపై తానే చూసుకుంటానని, వారి చదువులకు అయ్యే ఖర్చును నేను భరిస్తానని హీరో విశాల్ తాజాగా ప్రకటించారు.
అలాగే ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ.. పునీత్ ఈ సమాజానికి ఎన్నో మంచి పనులు చేశారు, చివరికి తన కళ్లను కూడా దానం చేశారు. అటువంటి గొప్ప వ్యక్తి లేరన్న విషయం ఇప్పటికీ నమ్మశక్యం కావడం లేదు. ఆయన మరణం ఒక్క చిత్ర పరిశ్రమకే కాదని, మొత్తం సమాజానికే తీరని లోటు. ఇక ఆయన సేవా కార్యక్రమాలకు తనవంతు సాయాన్ని అందిస్తాను` అంటూ మాటిచ్చారు. ఇక విశాల్ తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.