ప్రధాని నరేంద్ర మోడీ బ్లాక్ బస్టర్ దెబ్బకి దేశం షేక్ అవుతోంది. వాస్తవానికి మోడీ టార్గెట్లో ఉన్న నల్ల బకాసురుల మాటేమో కానీ.. పేద, మధ్యతరగతి వర్గాలు మాత్రం నిలువెల్లా ఒణికిపోతున్నారు. దేశ వ్యాప్తంగా చిల్లర లభించక నానా ఇక్కట్టు పడుతున్నారు. ఇక, బ్యాంకులకు వెళ్లి పాత నోట్లు మార్చుకుందామని అనుకున్నా వంద రకాల నిబంధనలు వారిని వేధిస్తున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా అన్ని వర్గాలూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
ఇక, సామాన్య, మధ్యతరగతి మార్కెట్లు కూడా పెద్ద ఎత్తున మూసివేతకు గురవుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో ముంబై సహా అనేక ప్రధాన పట్టణాల్లో సాధారణ జనజీవనం పెద్ద విపత్తునే ఎదుర్కొంటోంది. ఇక, ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో ఈ పెద్ద నోట్ల పెద్ద ప్రజాస్వామ్య పట్టుగొమ్మ అయిన ప్రింట్ మీడియాపై కూడా పడింది. ఇక్కడి ఒక పత్రిక నిర్వహణ ఖర్చులకు చిల్లర లేక నిత్య నరకం అనుభవిస్తున్న క్రమంలో విధిలేని పరిస్తితిలో దానిని మూసి వేసినట్టు ఆ పత్రియ యాజమాన్యం ప్రకటించింది.
వాస్తవానికి పత్రిక నిర్వహణ అంటేనే నిత్యం అనేక ఖర్చులు వుంటాయి. పేపర్ రవాణాకు వాహనాల కోసం డీజిల్ ఖర్చు, రిపోర్టర్ల కోసం పెట్రోల్ ఖర్చు, ప్రింటింగ్ మెటీరియల్ ఖర్చు ఇలా పైకి కనిపించని నిత్య ఖర్చులు ఉంటాయి. అయితే, ఈ ఖర్చులను తట్టుకోగలిగే స్థాయిలో చిన్న నోట్లు తమ వద్ద లేకపోవడంతో పత్రిక ప్రింటింగ్ను నిలిపివేసుకోవాల్సి వచ్చిందని కాంగ్లా పావ్ పత్రిక సంపాదకుడు పోనమ్ అన్నారు.పత్రికకు ప్రకటనలు ఇచ్చే వారి వద్ద కొత్త గా వచ్చిన 500 ,వెయ్యి రూపాయల నోట్లు ఉండడం లేదని ,దాంతో సమస్య వస్తోందని ఆయన తెలిపారు. మొత్తానికి పెద్ద నోట్ల దెబ్బ ఇలా పత్రికా రంగంపై ప్రభావం చూపడం ఇదే తొలిసారి!