దేశ ప్రధాని నరేంద్ర మోడీ పుణ్యమా అని తెలుగు రాష్ట్రాల్లో రెండు అధికార పార్టీలు పండగ చేసుకుంటున్నాయట! మోడీ పేరు చెప్పుకొని ఆయా పార్టీల అధ్యక్షులు హ్యాపీగా ఉన్నారట. మరి ఇంతకీ ఏంజరిగింది? అనేగా సందేహం.. ఇప్పుడు చూద్దాం.. మోడీ పెద్ద నోట్ల రద్దుతో దేశంలో పెను కలకలం ప్రారంభమైంది. ముఖ్యంగా బడాబాబులు తమ దగ్గరున్న రూ.500, రూ.1000 నోట్ల కట్టలను ఎలా వైట్ చేసుకోవాలో తెలియక బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారట. మోడీ మొన్నామధ్య చెప్పినట్టు.. కొందరు నిద్ర మాత్రలు కూడా వేసుకుని మరీ పడుకుంటున్నా.. నిద్ర మాత్రం పట్టడం లేదట.
తమ దగ్గరున్న నల్ల డబ్బును ఏం చేయాలనే దానిపై తలలు పట్టుకుంటున్న వారిలో రాజకీయ పార్టీలకు చెందిన నేతలు కూడా ఉన్నారట. దీంతో వీళ్లందరికీ కలిపి మూకుమ్మడిగా ఓ గొప్ప అయిడియా వచ్చిందట. 2019 ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్న వీరంతా అప్పడు ఎలాగూ పార్టీలకు ఫండ్స్ పేరుతో పెద్ద ఎత్తున సమర్పించుకోవాలికదా.. అదేదో ఇప్పుడు ఈ బ్లాక్ నే తరలించేస్తే.. అప్పుడు వైట్ రూపంలో టికెట్ లు పట్టేయొచ్చుకదా అని ప్లాన్ చేశారట. అంతేకాద, ఇప్పటికిప్పుడు ఇంత పెద్ద మొత్తాలను బ్యాంకులకు తీసుకెళ్లి మార్చుకునే అవకాశం లేకపోవడం, అంతా రికార్డెడ్గా ఉండడం, ఐటీ శాఖ అధికారులు పెద్ద ఎత్తున నిఘాను ముమ్మరం చేయడం వంటి కారణాల నేపథ్యంలో వాటి నుంచి తప్పించుకోవాలని నిర్ణయించారు. దీనికి ఈ బాట ఎంచుకున్నారు.
అంతే, ఈ ఐడియా రావడంతోనే ముందు అధికార పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తున్న వారంతా కట్టల కొద్దీ డబ్బును పార్టీల ఖజానాకు ఫండ్స్ రూపంలో తరలించేస్తున్నారట. ఇదేదో బాగుందని ఆయా పార్టీలు సైతం ఇచ్చింది ఇచ్చినట్టు తీసుకుని లెక్కలేసుకుంటున్నాయట. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఇప్పుడు అందరి నుంచి బ్లాక్ మనీని పెద్ద ఎత్తున పోగేసుకుంటున్న పార్టీలు.. 2019 నాటికి వీరందరికీ టికెట్లు ఇస్తాయా? అంటే క్వశ్చన్ మార్కు తప్ప సమాధానం లేదు. మరి ఒకవేళ అప్పుడు టికెట్ రాకపోతే.. ఇప్పుడు డబ్బులు ఇస్తున్నవాళ్లు యాగీ చేయరా? అంటే ఎలా చేస్తారు! వాళ్లిచ్చిందేమైనా వైట్ మనీనా? అనే ఆన్సర్ వస్తోంది. బాగుంది కదూ.. 2019 ఎన్నికల ఖర్చులో కొత్త ట్విస్ట్!!