అక్కినేని హీరో నాగ చైతన్య ప్రస్తుతం చందు మండేటి డైరెక్షన్లో తండేల్ సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో చైతూకి జంటగా సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీవాస్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్న ఈ సినిమా.. యథార్థ సంఘటన ఆధారంగా సముద్ర నేపథ్యంలో సాగే ప్రేమ కథగా తెరకెక్కిస్తున్నాడు చందు మండేటి. మత్స్యకార యువకుడిగా చైతన్య ఇందులో కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తికాకుండానే.. మరో సినిమాకు చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
హిట్ డైరెక్టర్ కార్తీక్ వర్మ దండుతో.. నాగచైతన్య ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయట. ఇక ఈ సినిమా షూటింగ్ మరో రెండు నెలల్లో ప్రారంభమవుతుందని సమాచారం. ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర సినీ చిత్రా బ్యానర్ నిర్మిస్తుంది. విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని రికార్డ్ సృష్టించిన కార్తీక్ దండుతో సినిమా చేసేందుకు ప్రస్తుతం స్టార్ హీరోలంతా ఆసక్తి చూపుతున్నారు.
ఈ క్రమంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న తండేల్ సినిమాతో పాటు.. కార్తీక్ డైరెక్షన్లో వస్తున్న సినిమాపై కూడా చైతన్య ఆశలు అన్ని ఉన్నాయి. ఇక కార్తీక్ దండు, నాగచైతన్య సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డే నటించనున్నట్లు తెలుస్తుంది. గతంలో వీరిద్దరి కాంబోలో ఒక లైలా కోసం సినిమా వచ్చి మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హిట్ అవ్వడంతో మరోసారి ఇదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఇక చై ఈ సినిమాలో డ్యూయల్ రూల్లో కనిపించబోతున్నారని.. వాటిలో ఒక పాత్ర ఎంతో భిన్నంగా ఉండబోతుందని సమాచారం.